తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 18: ‘మా ఉత్తరప్రదేశ్ల ఇట్లాంటి వైద్య సేవలు లేవు. ఇక్కడ ప్రభుత్వ దవాఖానల అన్ని పరీక్షలు ఉచితంగా చేసి, మందులు ఇస్తున్నరు’ అని ఉత్తరప్రదేశ్ నుంచి ఉపాధి కోసం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి వచ్చిన గర్భిణి రంజన్ మెచ్చుకున్నారు. శుక్రవారం తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జిల్లా అధికారులతో కలిసి సందర్శించారు.
అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భిణులకు అందుతున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో ఉత్తరప్రదేశ్కు చెందిన గర్భిణి రంజన్ పరీక్షలకు రాగా, వారి రాష్ట్రంలో గర్భిణులకు అందుతున్న సేవలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తమ రాష్ట్రంలో ఇలాంటి సేవలు లేవని, ఇక్కడ అన్ని పరీక్షలు చేసి మందులు ఉచితంగా ఇస్తున్నారని చెప్పింది. అక్కడున్న స్థానిక మహిళలు సైతం ప్రభుత్వ వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తంచేశారు.