హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం విధించిన షరతులకు అంగీకరించకపోతే ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించేది లేదని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సోమవారం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రభుత్వ విధానాన్ని అసెంబ్లీకి వివరించారు. కృష్ణా జలాల్లో 68-70% హకు పొందేందుకు తెలంగాణకు అర్హత ఉన్నదని చెప్పారు. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల నిష్పత్తిలో నీటి కేటాయింపు కారణంగా తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 225 టీఎంసీలు, భవిష్యత్లో చేపట్టబోయే ప్రాజెక్టులకు 260 చొప్పున మొత్తం 731 టీఎంసీలకు వరకు తెలంగాణ నీటి వాటా కోరాల్సి ఉన్నదని పేర్కొన్నారు.
పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, మల్యాల లిఫ్ట్, కేసీ కెనాల్, ముచ్చుమర్రి ద్వారా ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం 1,11,400 క్యూసెక్యుల నీటిని తరలించుకొనిపోతున్నదని వివరించారు. రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే రోజుకు 8 టీఎంసీలను ఏపీకి తరలించే ప్రమాదం ఉన్నదని, దీంతో కృష్ణానది ఎడారిగా మారుతుందని, నాగార్జునసాగర్ ఎండిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. తాము అధికారం చేపట్టినప్పటి నుంచి జలదోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి రాష్ర్టానికి 811 టీఎంసీలు బచావత్ అవార్డు ద్వారా కేటాయించారు కానీ, ప్రాజెక్టుల వారీగా కేటాయించలేదని వివరించారు. అసెంబ్లీ ఎన్నికలకు ఒకరోజు ముందు ఏపీ ప్రభుత్వం నాగార్జునసాగర్ పైకి పోలీసులను పంపిందని, కుడికాల్వను తెరిచి 5 వేల క్యూసెక్కుల నీటిని తరలించారని సభ దృష్టికి తీసుకొచ్చారు. నీటి వాటా పంపకాల్లో జరిగిన అన్యాయం కారణంగానే తెలంగాణను తెచ్చుకున్నామని, తెచ్చుకున్న తెలంగాణలోనూ అన్యాయాలు జరగరాదన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రమాణస్వీకార చేసిన తర్వాత ప్రాజెక్టు కేటాయింపుపై తాము ఎవరితోనూ మాట్లాడలేదని, తమతో ఎవరూ సంప్రదింపులు జరపలేదని తెలిపారు.