హైదరాబాద్ : కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగుల కోత, ఉద్యోగావకాశాలు సన్నగిల్లడం, నిరుద్యోగిత పెంపు వంటి వార్తలు వినవస్తుండగా యుఎస్ ఆధారిత డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్స్ సంస్థ యుఎస్టీ తన హైదరాబాద్ కేంద్రాన్ని అంతకంతకు విస్తరించుకుంటూ వెళ్తుంది. యుఎస్టీ 2018లో 250 మంది ఉద్యోగులతో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్త కరోనా సంక్షోభంలోనూ 2020లో తన ఉద్యోగుల సంఖ్యను 500కు పెంచుకుంది. అదే 2021లో ఆ సంఖ్యను వెయ్యికి పైగా విస్తరించింది. కాగా 2023 చివరి నాటికి ఈ సంఖ్యను రెట్టింపు(2,000) చేయాలని కంపెనీ యోచిస్తోంది.
కొవిడ్ -19 పరిస్థితులు చక్కబడ్డ తర్వాత ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి రాగానే నియామక ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు సంస్థ తెలిపింది. రాబోయే 12-18 నెలల్లో ఆరోగ్య సంరక్షణ, రిటైల్, మ్యానుఫాక్చరింగ్ క్లైంట్స్ కోసం ఉత్పత్తులు, సేవలపై ఈ కంపెనీ దృష్టి సారించింది. ఈ ఏడాది ఫుల్-స్టాక్ డెవలపర్లు, ఆటోమేషన్ ఇంజనీర్లు, ఇతర నిపుణులను నియమించాలని యుఎస్టీ యోచిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. స్థానిక యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు యుఎస్టీ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. యుఎస్టీ విస్తరణ అంశం తెలంగాణలో అంకితమైన, నైపుణ్యం కలిగిన అదేవిధంగా విస్తృతమైన శ్రామిక శక్తికి నిదర్శనం అని పేర్కొన్నారు.