వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 08: డ్రోన్ల వినియోగంతో వ్యవసాయానికి ఎంతో మేలు జరుగుతుందని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ప్రవీణ్రావు తెలిపా రు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేకర్లుతో మాట్లాడుతూ.. నూతన వ్యవసాయ విధానాలతో రైతులను ఆర్థికంగా బలోపేతంచేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం, జయశంకర్ వ్యవసాయ వర్సిటీ విశేష కృషి చేస్తున్నాయని చెప్పారు. పంటల సాగులో డ్రోన్ల వినియోగం, డిజిటల్ పద్ధతులపై వర్సిటీ గతేడాది వానాకాలం నుంచి పరిశోధనలను ప్రారంభించి మంచి ఫలితాలు సాధించిందని చెప్పా రు. వాతావరణ మార్పులు, కూలీల కొరత వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాల్లో వరి, పత్తి, కంది, వేరుశనగ, నువ్వుల పంటల్లో మందుల పిచికారీకి డ్రోన్లను వినియోగించి అద్భుత ఫలితాలు రాబట్టామని తెలిపారు. తక్కువ సమయంలోనే ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీకి, పురుగుమందుల వల్ల మనుషులకు హాని కలుగకుండా నిరోధించేందుకు డ్రోన్లు ఉపకరిస్తాయన్నారు. సాగులో డ్రోన్ల వినియోగానికి ఈ ఏడాది మరో రూ.18.65 లక్షలు కేటాయించినట్లు ప్రవీణ్రావు వెల్లడించారు. పురుగుమందుల పిచికారీకి డ్రోన్ల వినియోగంపై పరిశోధనకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దేశంలోనే తొలిసారి ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయానికి అనుమతి ఇచ్చినట్లు వర్సిటీ డైరెక్టర్ జగదీశ్వర్ తెలిపారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచేందుకు, డ్రోన్ల పైలెట్లుగా గ్రామీణ యువతను తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఏషియా పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీతో త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకొని ముందుకుసాగుతున్నామని చెప్పారు. హైదరాబాద్లోని మారుట్ డ్రోన్ టెక్సంస్థతో కలిసి పనిచేస్తున్నామన్నారు.