Varun Raj | వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం జిల్లా విద్యార్థి వరుణ్ రాజ్ (Varun Raj) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. లూథరన్ దవాఖానలో (Lutheran Hospital) చికిత్స పొందుతున్న ఆయన ఇంకా కోమాలోనే ఉన్నాడు. లైఫ్సపోర్టుపై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది. ఈ క్రూరమైన దాడి తమను తీవ్రంగా కలచివేసిందని, అతడు త్వరగా కోలుకోవాలని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి ఆకాంక్షించారు. ఈ కేసుపై ఏవైనా సందేహాలుంటే స్థానిక చట్టాలను కూడా పక్కనపెడుతామన్నారు. దాడి అనంతరం నిందితుడిని అరెస్టు చేశామని, అతనిపై హత్యాయత్నం కేసు నమోదుచేశామని వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతున్నదని, దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.
ఖమ్మం జిల్లా మామిళ్లగూడెంకు చెందిన 24 ఏండ్ల పుచ్చా వరుణ్ రాజ్ అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఎంఎస్ చదువుతున్నాడు. రోజూలాగే అక్టోబర్ 31న జిమ్కు వెళ్లిన వరుణ్.. తిరిగి ఇంటికి వెళ్తుండగా ఓ దుండగుడు కత్తితో పొడిచాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. అయితే తీవ్రమైన నరాల బలహీనత ఏర్పడి ఎడమవైపు పాక్షిక వైకల్యం బారినపడే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు.