హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పారిశ్రామిక అనుకూల వాతావరణం చక్కగా ఉన్నదని, అమెరికా సంస్థలు భారతీయ సంస్థలతో కలిసి ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని భారత్లో అమెరికా రాయబారి ఎలిజబెత్ జోన్స్ ప్రశంసించారు. తన పర్యటనలో హైదరాబాద్లోని అమెరికా వ్యాపార సంస్థల ప్రతినిధులతో చర్చించానని, ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అని అడగగా..ఏ ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా మంగళవారం బేగంపేటలోని యూఎస్ కాన్సులేట్ను సందర్శించిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో కలిసి టీహబ్ను సందర్శించానని, చాలా అద్భుతంగా ఉన్నదని కొనియాడారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్యానికి హైదరాబాద్ కేంద్ర స్థానంగా ఉన్నదని, గతేడాది అమెరికా సంస్థలు పదుల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని గుర్తుచేశారు. ప్రస్తుతం అమెరికన్ కంపెనీలు తెలంగాణలో సుమారు లక్ష మంది ఉద్యోగులను నియమించుకొన్నట్టు చెప్పారు.
భారతీయ విద్యార్థులకు అమెరికా స్టూడెంట్ వీసాలు లభించడంలో జరుగుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తామని, 6 నెలల్లో కాన్సులేట్ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని నియమిస్తామని ఎలిజబెత్ జోన్స్ తెలిపారు. గత ఏడాది స్టూడెంట్ వీసాలు పొంది న విదేశీయుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్నారని చెప్పారు. భారత్కు చెందిన సుమా రు 2 లక్షల మంది విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారని, గత సంవత్సరం దాదాపు 1.25 లక్షల వీసాలు మంజూరు చేశామని వివరించారు. హైదరాబాద్లో నిర్మిస్తున్న నూతన కాన్సులేట్ భవనం 6 నెలల్లో అందుబాటులోకి వస్తుందని, తద్వారా అదనపు సిబ్బందిని నియమించి వీసా, ఇతర సేవల్లో వేగం పెంచుతామని పేర్కొన్నారు. తెలంగాణపై అమెరికాకు ఉన్న చిత్తశుద్ధికి ఈ భవనం నిదర్శనమని ఎలిజబెత్ జోన్స్ వివరించారు.
భారత్కు పాకిస్థాన్, చైనాతో ఉన్న సరిహద్దు వివాదాల్లో తాము సొంతంగా తలదూర్చబోమని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి అంశాల్లో ఏ దేశానికైనా సొంతంగా నిర్ణయం తీసుకొనే అధికారం ఉన్నదని, ఒకవేళ భారత్ కోరితే సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అమెరికాలో సుమారు 40 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనేక మంది చట్టసభలకు ఎన్నికయ్యారని చెప్పారు. కార్యక్రమంలో యూఎస్ హైదరాబాద్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ తదితరులు పాల్గొన్నారు.