మహబూబ్ నగర్ : పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే హరితహారం కార్యక్రమంలో భాగంగా రహదారికి ఇరువైపులా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మున్సిపల్ వార్డులు, గ్రామాల్లో ఎక్కడ చెత్త ఉండకూడదని, దోమల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు.
చెత్తాచెదారం తీసివేయాలని, ప్రతి ఇంటి ముందు 6 మొక్కలు నాటాలని కోరారు. ఊరంతటినీ శుభ్రంగా ఉంచాలని, వార్డు సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు.
గతంలో పాలకొండ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని అన్నారు. రూ. 14 లక్షల రూపాయలతో పాలకొండ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. గ్రామంలో మురికి కాలువ సమస్యను రేపటిలోగా పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా రహదారికి ఆవలివైపున ఉన్న 15 ఇండ్లకు తాగునీరు లేదని తెలుసుకున్న మంత్రి తక్షణమే రాత్రి లో గా తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని, గ్రామంలోని అన్ని కులాల వారికి ఉపయోగపడేలా శ్మశాన వాటిక నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.పెన్షన్ రాని వారి జాబితాను రూపొందించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ కౌన్సిలర్ నరేందర్, ట్రాన్స్కో ఎస్ఈ శ్రీరామమూర్తి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి
వెదజల్లే పద్దతిలో వరి సాగుతో అధిక లాభాలు : మంత్రి హరీశ్ రావు
బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడి వ్యక్తి మృతి
పల్లెప్రగతి పనులను పరిశీలించిన మంత్రి వేముల
వనపర్తి జిల్లాలో నూతన కోర్టులు ప్రారంభం
ల్యాబర్తిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఆరూరి