హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్తాకు ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ విశ్వగురు వరల్డ్ రికార్డ్సు అవార్డును అందించారు. తార్నాకలోని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో బుధవారం ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అత్యవసర సేవల కోసం రూ.25 లక్షలు వెచ్చించి అందించిన నూతన అంబులెన్స్ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. కరోనా సమయంలో ఉప్పల ఫౌండేషన్ తరపున శ్రీనివాస్గుప్తా ప్రతిరోజూ రెండువేల మందికి ఆహార పొట్లాలు, నీళ్ల ప్యాకెట్లు అందించారు. 1,400 కరోనా కిట్లు, నిరుపేదల వివాహానికి పుస్తె మెట్టెలు, సామాగ్రి పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన శ్రీనివాస్ గుప్తాను ఈ అవార్డుకు ఎంపికచేసినట్టు ఆ సంస్థ సీఈవో సత్యవోలు రాంబాబు తెలిపారు.