నవాబ్పేట, జనవరి 6 : చేసిన పనికి బిల్లు మంజూరు కాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఉపసర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం దేపల్లిలో చోటుచేసుకున్నది. దేపల్లికి చెందిన ఉపసర్పంచ్ యశోద భర్త దామోదర్ ఆరు నెలల కిందట గ్రామంలో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టేందుకు రూ.2.14 లక్షలు మంజూరు కాగా అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అనివార్య కారణాలతో పనిచేయలేదు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత పనులు చేపట్టడానికి వెళ్తే.. స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డు తగిలారు. ఈ విషయాన్ని మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పనులు చేసుకోవాలని సూచించారు. పనులు పూర్తి చేసి బిల్లు కోసం పంచాయతీరాజ్ ఏఈ రాములును సంప్రదించారు.
‘నీ బిల్లు ఆపాలని ఎమ్మెల్యే సోదరుడు దుష్యంత్రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకుడు వెంకటేశ్గౌడ్ ఒత్తిడి తెస్తున్నారు. నేను ఈ బిల్లు చేయలేను’ అని ఏఈ తేల్చిచెప్పారు. బిల్లు కోసం జిల్లా అధికారులను కలిసినా స్పందన కరువైంది. మనస్తాపానికి గురైన ఆయన శుక్రవారం రాత్రి జడ్చర్ల-గంగాపూర్ మధ్య క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయాన్ని ఆయన తన ఫోన్ స్టేటస్, వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడంతో వైరల్ అయ్యింది. స్థానికులు గుర్తించి అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను జడ్చర్ల ఏరియా దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న దామోదర్ మీడియాతో మాట్లాడుతూ.. అప్పు చేసి డ్రైనేజీ పనులు పూర్తి చేశానని, బిల్లు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు చెప్పారు.