సహకార బ్యాంకుల బలోపేతంపై అధ్యయనం
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సహకార వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం తీసుకొన్న చర్యలపై ఉత్తరప్రదేశ్ సహకార బ్యాంకు అధికారుల బృందం అధ్యయనం చేసింది. ఈ బృందం సోమవారం టెస్కాబ్ కార్యాలయాన్ని సందర్శించింది. దేశవ్యాప్తంగా సహకార బ్యాంకుల బలోపేతానికి, బ్యాంకుల మధ్య సమన్వయం పెంపొందించేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు చేపట్టింది. సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో దేశంలోనే పటిష్ఠంగా ఉన్న తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టెస్కాబ్)ను సందర్శించాలని పలు రాష్ర్టాలకు సూచించింది.
ఆర్బీఐ సూచనల మేరకు యూపీ బృందం సోమవారం టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావుతో సమావేశమై సాంకేతిక వినియోగం, ఆడిటింగ్ విధానాలపై తెలుసుకున్నది. బ్యాంకులో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ను బృందం సభ్యులు సందర్శించారు. సైబర్ దాడుల నివారణ చర్యలను టెస్కాబ్ ఎండీ నేతి మురళీధర్ యూపీ బృందానికి వివరించారు. యూపీ బృందంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు బీఎల్ మీనా, బీ చంద్రకళ, వీకే మిశ్రా తదితరులు ఉన్నారు.