హైదరాబాద్: రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షదీప్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్నాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పైగా ఈశాన్య రుతుపవనాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేగాక ఉరుములు మెరుపులతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.
మంగళవారం హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో మూడు గంటలపాటు వర్షం దంచికొట్టింది. కొన్ని చోట్ల తేలికపాటిగా, అక్కడక్కడ భారీ వర్షం పడింది.
అత్యధికంగా భద్రాద్రి-కొత్తగూడెంలోని మద్దుకూరులో 10 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరిలోని నారాయణపూర్లో 7.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. శేరిలింగంపల్లి, లింగంపల్లిలో 4 సెంటీమీటర్ల వర్షం పడింది. వచ్చే మూడు రోజులు హైదరాబాద్, మహబూబ్నగర్, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాలతోపాటు మేడ్చల్-మల్కాజిగిరి, వరంగల్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మంగళవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు.. భద్రాద్రి-కొత్తగూడెం 10 సెంటీమీటర్లు, యాదాద్రి-భువనగిరి జిల్లాలోని నారాయణపూర్లో 7.6 సెంటీమీటర్లు, నల్లగొండలోని పుల్లెంలలో 5.2 సెంటీమీటర్లు, నల్లగొండలోని మాడుగులపల్లిలో 4.7 సెంటీమీటర్లు, ఖమ్మంలోని తిమ్మారావుపేటలో 4.6 సెంటీమీటర్లు, ములుగులోని అలుబాకలో 4.2 సెంటీమీటర్లు, హైదరాబాద్లోని చందానగర్లో 3.5 సెంటీమీటర్లు, ముసాపేటలో 2.6 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 2.4 సెంటీమీటర్లు, ఆర్సీపురంలో 1.9 సెంటీమీటర్లు, మాదాపూర్, బోరబండలో 1.6 సెంటీమీటర్లు, కూకట్పల్లి, ఖైరతాబాద్, కాప్రా, ఉప్పల్, షేక్పేట, పటాన్ చెరులలో 1 సెంటీమీటర్ చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.