హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించేందుకు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ఉత్తమ విధానాలను అమలు చేస్తున్నదని ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం ప్రశంసించింది. ఉత్తరప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులు శనివారం తెలంగాణలో పర్యటించారు. బీఆర్కే భవన్లో సీఎస్ సోమేశ్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖ అమలు చేస్తున్న విధానాలను సీఎస్ ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ బృందానికి వివరించారు.
ఈ శాఖను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఆయన మార్గనిర్దేశం మేరకు వ్యవస్థీకృత మార్పులు చేయడం ద్వారా వాణిజ్య పన్నుల శాఖ పనితీరులో గణనీయమైన పురోగతి వచ్చిందని, దీంతో 2014లో రూ.23 వేల కోట్లుగా ఉన్న ఆ శాఖ ఆదాయం.. గతేడాది నాటికి దాదాపు మూడు రెట్లు పెరిగి రూ.65 వేల కోట్లకు చేరిందని తెలిపారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. కొత్తగా అనేక సరిళ్లను ఏర్పాటుచేసి ప్రతి స్థాయిలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించామని వివరించారు. మాన్యువల్ నోటీసులు, ప్రొసీడింగ్ల జారీని పూర్తిగా తొలగించి శాఖాపరమైన పరిశోధనలు, విశ్లేషణల కోసం ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం యూపీ యూపీ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎస్ మినిస్టి మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న ఉత్తమ విధానాలను తెలుసుకోవడం ఆనందంగా ఉన్నదన్నారు. ఈ విధానాలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, అదనపు కమిషనర్లు సాయి కిశోర్, కాశి, శోభన్బాబు, యూపీ అధికారులు పాల్గొన్నారు.