హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): నీతులు ఇతరులకు చెప్పటానికే తప్ప, తమకు కావన్నట్టు ఉన్నది బీజేపీ రీతి. ‘ఒక్క మనుగోడు ఉప ఎన్నిక కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తాన్ని అక్కడ మోహరించింది’ అని ఇటీవల ప్రధాని మోదీ తన హైదరాబాద్ పర్యటనలో టీఆర్ఎస్పై విమర్శలు చేశారు. మరి అదే ప్రధాని మోదీ.. ఉత్తరప్రదేశ్లో రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ సీటుకు జరిగే ఉపఎన్నికల ప్రచారానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున మోహరిస్తున్నారు. దీనిపై జనానికి బీజేపీ ఏం సమాధానం చెప్తుంది? యూపీలో మైన్పురి లోక్సభ, రాంపూర్, ఖతౌలీ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ మూడు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి మంత్రులను రెండు గ్రూపులుగా విభజించి పంపేలా, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను మోహరించేలా ప్రచార కార్యక్రమాన్ని బీజేపీ అధిష్ఠానం ఖరారుచేసింది. మంత్రు లు అజిత్పాల్, అసీమ్ అరుణ్, రాకేశ్ సచిన్తో ఒక బృందాన్ని, ప్రతిభా శుక్లా, జైవీర్ సింగ్, సందీప్ సింగ్తో రెండో బృందాన్ని మైన్పురి ప్రచారానికి దింపింది. ఖతౌలిలో ప్రచారానికి మంత్రులు కపిల్దేవ్ అగర్వాల్, నరేంద్ర కశ్యప్, జశ్వంత్, దినేశ్ ఖాతిక్, గులాబ్ దేవిని నియమించింది. రాంపూర్లో ప్రచార బాధ్యతలు మంత్రులు జితిన్ ప్రసాద, బల్దేవ్ అవులక్, సురేష్ ఖన్నా, ధరమ్పాల్ సింగ్కు అప్పగించింది. మైన్పురి లోక్సభ, రాంపూర్ అసెంబ్లీ సీటు సమాజ్వాదీ పార్టీ సిట్టింగ్ స్థానాలు.