మహబూబ్నగర్, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అకాల వర్షాలు రైతును కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈదురు గాలులకుతోడు వర్షం కురవడంతో ఆరబోసిన మక్కలు, వరి ధాన్యం తడిసిపోయింది. నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి, ఖిల్లాఘణపురం, కొత్తకోట, రాజోళి, మహబూబ్నగర్లో పంటలు దెబ్బతిన్నాయి. నవాబ్పేట, ఆత్మకూరులో వడగండ్లు పడ్డాయి. దీంతో మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లు పడ్డారు.
కొందరు టార్పాలిన్లు కప్పి పంటను కాపాడుకోగా.. మరికొందరు కవర్లు కప్పేలోగా వర్షార్పణమైంది. కష్టమంతా నీటి పాలైందని దిగాలు చెందారు. యార్డుల్లో వరి, మక్కను 20 రోజులుగా కాపాడుకుంటూ వస్తే.. చివరకు వరుణదేవుడు తమను నిండా ముంచాడని ఆవేదన చెందారు. కాగా పిడుగుపాటుకు నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.