హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఒకవైపు ఎండలు దంచి కొడుతుంటే.. మరోవైపు ఈదురు గాలులతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. భిన్నమైన ఈ వాతావరణ పరిస్థితులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రత వల్ల వృద్ధు, పసిపిల్లలు వడదెబ్బకు గురవుతున్నారు. సాయంత్రం వేళల్లో కురుస్తున్న అకాల వర్షాల వల్ల ధాన్యం, వేరుశెనగ పంటలు తడిసిపోతుండటంతో రైతులు అల్లాడుతున్నారు. సోమవారం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40.3 నుంచి 44.5 సెల్సియస్ డిగ్రీల వరకు నమోదయ్యాయి.
రానున్న నాలుగు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 6 వరకు ఈదురు గాలులు వీయడంతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ప్రస్తుతం విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమల మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని, దీని ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో హైదరాబాద్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.