మొయినాబాద్, మార్చి 27 : ఆస్తి పన్ను వసూలు చేసి పంచాయతీ ఆదాయం పెంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది నవంబర్ నుంచి పన్నులు వసూలు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. వంద శాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో మార్చి 23 నాటికి 91 శాతం పన్ను వసూలు చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అధికంగా పన్నులు వసూలు చేశారు. ప్రజలు, ఇంజినీరింగ్ కళాశాలల నుంచి అధికారులు ఆస్తి పన్ను వసూలు చేసి పంచాయతీలకు ఆదాయం సమకూర్చి పెట్టారు.
మొయినాబాద్ మండల పరిధిలో..
మొయినాబాద్ మండల పరిధిలో 28 పంచాయతీలు, 9 అనుబంధ పంచాయతీలు ఉన్నాయి. మండల పరిధిలోని చిలుకూరు, ఎన్కేపల్లి, హిమాయత్నగర్, అజీజ్నగర్, పెద్దమంగళారం గ్రామాల్లో ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఎత్బార్పల్లి, కనకమామిడి, నాగిరెడ్డిగూడ, ఎన్కేపల్లి, పెద్దమంగళారం, అజీజ్నగర్, చిలుకూరు రెవెన్యూ పరిధిలో విద్యా సంస్థలు ఉన్నాయి. చిలుకూరు పరిధిలో బీఈడీ కళాశాల ఉండగా కనకమామిడి రెవెన్యూ పరిధిలో సివిల్ అకాడమీ ఉంది. వివిధ గ్రామాల్లో నిర్మించుకున్న వ్యవసాయ క్షేత్రాల యజమానులు, రిసార్ట్స్ యాజమానులు సైతం ఆస్తి పన్ను చెల్లించాలని, వారు చెల్లించాల్సిన ఆస్తి పన్నుకు సంబంధించి నోటీసులు ముందస్తుగా జారీ చేశారు. మొయినాబాద్, హిమాయత్నగర్, పెద్దమంగళారం, చిన్నమంగళారం గ్రామాల రెవెన్యూ పరిధిలో ఫంక్షన్ హాల్స్ నిర్మించారు. మండలంలో మొత్తం రూ.3.31 కోట్లు వసూలు చేయాలని జిల్లా అధికారులు టార్గెట్ ఇవ్వగా, మార్చి 23 నాటికి రూ.3.05 కోట్లు పన్నులు వసూలు చేశారు. మార్చి 31 నాటికి వంద శాతం లక్ష్యం పెట్టుకోగా 91.91 శాతం పన్నులు వసూలు చేశారు.
వంద శాతం వసూలు చేసిన పంచాయతీలు..
11 పంచాయతీలు మార్చి 23 నాటికి 100 శాతం పన్నులు వసూలు చేశాయి. అప్పారెడ్డిగూడ, చందానగర్,ఎల్కగూడ, కాశీంబౌలి, మోత్కుపల్లి, నక్కలపల్లి, కుతుబుద్దీన్గూడ, రెడ్డిపల్లి, శ్రీరాంనగర్, వెంకటాపూర్, ఎతుబార్పల్లి పంచాయతీలు వంద శాతం పన్నులు వసూలు చేశాయి. 90 శాతం పైగా అమ్డాపూర్, అప్పోజిగూడ, అజీజ్నగర్, బాకారం, చిలుకూరు, కనకమామిడి, కేతిరెడ్డిపల్లి, ముర్తూజాగూడ, నాగిరెడ్డిగూడ, పెద్దమంగళారం, సురంగల్, తోలుకట్టా, ఎన్కేపల్లి పంచాయతీలు పన్నులు వసూలు చేశాయి. మిగిలిన పంచాయతీలు 90 శాతం కంటే తక్కువ పన్నులు వసూలు చేశాయి.
వంద శాతం లక్ష్యం..
వంద శాతం పన్నులు మార్చి 31 నాటికి వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మండలంలో 28 పంచాయతీలో రూ.3.31 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. మార్చి 23 నాటికి రూ.3.05 కోట్లు వసూలు చేశాం. కార్యదర్శులు ఉదయం 7 గంటలకు పంచాయతీలకు చేరుకుని పన్నులు వసూలు చేస్తున్నారు. సగం పంచాయతీలు 100 శాతం పన్నులు వసూలు చేశారు. ఆదివారం స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి మొండి బకాయిలను వసూలు చేస్తున్నాం. ఇంకా 8 శాతం పన్నులు వసూలు చేయాల్సి ఉంది. నాలుగు రోజుల్లో టార్గెట్ చేరుకుంటాం.
-సురేందర్రెడ్డి, ఎంపీవో, మొయినాబాద్