Jangaon | జనగామ, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ మార్కెట్లలో రైతులకు జరుగుతున్న దగాపై పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నా, రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించకపోతే కఠినచర్యలు ఉంటాయని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరికలు జారీచేసినా పరిస్థితి మారలేదు. రైతుల కష్టాలు తీరడం లేదు. వ్యవసాయ మార్కెట్లలో అదే దగా.. అదే దోపిడీ కొనసాగుతున్నది. దీంతో కడుపు మండిన రైతులు మళ్లీ మళ్లీ ఆందోళనలకు దిగుతున్నారు. ఇందుకు తిరుగులేని ఉదాహరణ జనగామ వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న తతంతగం. ఇటీవల జనగామ మార్కెట్లో ధాన్యానికి మద్దతు ధర దక్కడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. దీంతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైతులకు జరుగుతున్న అన్యాయాలను ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ‘ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి’ అంటూ సీఎం రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు.
దీంతో అప్పటివరకు క్వింటా ధాన్యానికి మద్ద తు ధర రూ.2,200కు బదులు రూ.1,530 మాత్రమే ముట్టజెప్పిన వ్యాపారులు అతి కష్టం మీద మరో రూ.30 మాత్రమే పెంచారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి..‘రైతు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకే కొంటాం.. ధర తగ్గించే వారిపై కఠిన చర్యలు ఉంటాయి’ అని హెచ్చరించారు. కానీ, వరుసగా ఐదోరోజు సోమవారం కూడా జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మక్కల కొనుగోళ్లలో ప్రతిష్ఠంభన కొనసాగింది. సీఎం హెచ్చరించినా, మార్కెటింగ్, రెవెన్యూ, సహకార, పౌర సరఫరాల సంస్థలకు చెందిన దాదాపు 50 మంది అధికారులు మార్కెట్లో పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నా పరిస్థితి మారలేదు. దీంతో రైతులు, మహిళా రైతులు పిల్లాపాపలతో సద్దులు కట్టుకొని వచ్చి యార్డులో పడిగాపులు కాస్తున్నారు.
ఇప్పటికే దాదాపు 40 వేలకుపైగా ధాన్యం బస్తాలు మార్కెట్లో పేరుకుపోయాయి. సహకారసంఘం, ఐకేపీ, సివిల్సైప్లె వంటి మూడు ప్రభుత్వరంగ కొనుగోలు కేంద్రాలను మార్కెట్ ఆవరణలో ఏర్పాటుచేసినా వాటి ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యం రెండు వేల బస్తాలు మాత్రమే. ఎక్కడి రైతులైనా సరే మార్కెట్కు వచ్చి మద్దతు ధరకు అమ్ముకోవచ్చునని అధికారులు ప్రకటించడంతో, కొనుగోళ్లు జరగకపోయినా ప్రతి రోజూ ఉత్పత్తులు వస్తూనే ఉన్నా యి. వాటిని వెంటనే కొనే దిక్కులేకపోవడంతో ధాన్యం, మక్కల నిల్వలు మార్కెట్ యార్డులో భారీగా పేరుకుపోతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో జోక్యం చేసుకున్నా, తేమ, తాలు, మట్టి సాకు చెప్పి జనగామ మార్కెట్లో ప్రభుత్వరంగ సంస్థలు నామమాత్రంగా కొనుగోళ్లు చేస్తున్నాయి. మద్దతు ధర ఇచ్చేది లేదని ట్రేడర్లు, వ్యాపారులు తెగేసి చెప్తున్నారు.
రైతుల ఆగ్రహ జ్వాల
సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనుగోళ్ల కోసం ఎదురుచూసిన రైతులు కడుపుమండి ఆందోళనకు దిగారు. పలుమార్లు మార్కెట్ కార్యాలయంలోకి వెళ్లి మార్కెటింగ్ డిప్యూటీ డైరెక్టర్ రాజునాయక్, జిల్లా మార్కెటింగ్ అధికారి నరేంద్ర, ఆర్డీవో కొమురయ్య, కార్యదర్శి శ్రీనివాస్ను నిలదీశారు. నిబంధనల ప్రకారం తేమ, తాలు లేని ధాన్యానికే మద్దతు ధర దక్కుతుందని, లేకుంటే రైతులు ఆరబెట్టుకునే వరకు కొనేదిలేదని అధికారులు స్పష్టంచేశారు. యార్డులో ధాన్యం కుప్ప పక్కనే మరో కుప్పపోయడంతో ఆరబెట్టుకొనే స్థలం దొరకడం లేదు. దీంతో ఐదారు రోజుల క్రితం పోసిన కుప్ప(రాశులు) మక్కి, బూజుపట్టి ధాన్యం రంగుమారుతున్నది. ఇంకా ఆగితే ధాన్యం ఎందుకు పనికి రాకుండా పోతుందనే ఆందోళనతో పలువురు రైతులు తక్కువ ధరకే ట్రేడర్లకు అమ్ముకునేందుకు సిద్ధపడ్డారు. మరికొందరు రైతులు మళ్లీ రవాణా చార్జీలు పెట్టుకొని మిల్లర్లు, బయట వ్యాపారులకు వద్దకు వాపస్ తీసుకెళ్లారు. ‘యార్డులో మద్దతు ధరకు మాత్రమే కొనాలని పైనుంచి ఆదేశాలున్నాయి. బయటకు వెళ్లి మీరు ఎంతకైనా అమ్ముకోండి’ అంటూ అధికారులు నర్మగర్భంగా చేస్తున్న వ్యాఖ్యలు రైతులను మరింత కోపోద్రిక్తులను చేస్తున్నాయి. ‘ప్రభుత్వం మద్దతు ధరకు కొనదు. ప్రైవేట్కు అమ్ముకోనివ్వదు. మేం ఎన్నిరోజులు మార్కెట్లో పస్తులతో పడిగాపులుండాలి?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు కార్యాలయంలోకి వెళ్లి తాళాలు వేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యాలయం ముందు ఎండుగడ్డి, చెత్తను పోగేసి మంటపెట్టి రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
క్వింటా 1,600కే అడుగుతున్నరు
కేసీఆర్ రైతుకు కష్టం రానివ్వలేదు. నిరుడు ఇదే సీజన్లో మార్కెట్కు తెస్తే క్వింటాకు రూ.1,900 ధర వచ్చింది. ఇప్పుడేమో షావుకారు రూ. 1,600 అంటున్నడు. అధికారులు పట్టించుకోవడం లేదు. మార్కెట్లో మద్దతు ధర వస్తదని ఆశపడ్డం. ఇప్పుడు వడ్లలో తేమ ఉన్నదని కొంటలేరు. ఐదారు రోజుల నుంచి ఇక్కడే కావలి ఉంటున్న. రోజుకు వంద, రెండొందల ఖర్చు అవుతున్నది.
– తూముల మల్లయ్య,మాణిక్యపురం, లింగాలఘనపురం