యూఎన్ ప్రతినిధి ఎరిక్ సొల్హెయిమ్ ప్రశంసలు
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ కృతజ్ఞతలు
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్పై యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సొల్హెయిమ్ ప్రశంసలు కురిపించారు. గ్రీన్ చాలెంజ్లో భాగంగా ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో ఒక గంటలో పది లక్షల మొక్కలు నాటడం అద్భుతమని కొనియాడారు. గిన్నిస్ బుక్ రికార్డులకెక్కడానికి ప్రయత్నిస్తుండటం గొప్ప విషయమని ట్వీట్ చేశారు. దీనిపై గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ సంతోషం వ్యక్తంచేశారు. గ్రీన్ చాలెంజ్పై ప్రోత్సాహకర వ్యాఖ్యలు చేసినందుకు ఎరిక్ సొల్హెయిమ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎరిక్ వంటి ఉన్నతమైన వ్యక్తుల స్ఫూర్తితో గ్రీన్ చాలెంజ్ మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నాన్ని సాకారం చేస్తామని ఆయన రీట్వీట్ చేశారు. మరోవైపు, 24న ఐటీశాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేప ట్టే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా రవిశంకర్కు ఎంపీ సంతోష్కుమార్ వృక్షార్చన పోస్టర్ అందజేశారు.
13న రెండు లక్షల విత్తన బంతులు
హరితహారాన్ని మరింత విజయవంతం చేయడానికి అధికారులు విత్తన బంతులను వెదజల్లే (సీడ్ బాంబింగ్ ) విధానాన్ని అనుసరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్, కడ్తాల్ రేంజ్లలో రెండు లక్షల సీడ్బాల్లను వెదజల్లడానికి అటవీశాఖ, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్, ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈ నెల 13న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఒకేరోజు రెండు లక్షల విత్తన బంతులు విసిరే కార్యక్రమ పోస్టర్ను పీసీసీఎఫ్ ఆర్ శోభ బుధవారం అరణ్యభవన్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్ (సామాజిక వనాలు) ఆర్ఎం డోబ్రియాల్, అడిషనల్ పీసీసీఎఫ్ సునితాభగవ త్, రంగారెడ్డి జిల్లా డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ జానకిరామ్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ డైరెక్టర్ సాయి భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.