ములుగు : ములుగు జిల్లాలో అమానవనీయ ఘటన చోటు చోసుకుంది. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా నిద్రించాల్సిన చిట్టితల్లిని కర్కశంగా వదిలేశారా పసిపాప తల్లిదండ్రులు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని వెంకటాపురం నూగూరు మండలం పాత్రపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అప్పుడే పుట్టిన ఆడ శిశువును(New born Baby Girl) గుర్తుతెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లిపోయారు.
అటుగా వెళ్తున్న స్థానికులు పొదల్లో ఆడ శిశువు ఏడుపు విని అధికారులకు సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న అధికారులు చిన్నారిని రక్షించి దవాఖానకు తరలించారు. శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆడపిల్ల పుట్టడంతో తల్లిదండ్రులే శిశువును వదిలించుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.