సంక్షేమ పథకాల ఫలితంగానే నేడు రాష్ట్రంలో పేదరికం తగ్గి, తలసరి ఆదాయం పెరిగింది. 2015-18 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం, 2019-21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చింది. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
– సీఎం కేసీఆర్
CM KCR | హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలందరి దీవెనలతో రాష్ట్రంలో ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయని, దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులకు పరాజయం తప్పదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హెచ్చరించారు. జాతీయ సమైక్యతా దినోత్సవ వేళ బంగారు తెలంగాణ సాధనకు కృషి చేద్దామని, రాష్ట్ర ప్రగతిని ఇదే విధంగా కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. దేశంలో ఏ ప్రాంతంలోనైనా, ఎవరి నోట విన్నా తెలంగాణ మాడల్ మార్మోగుతున్నదని స్పష్టంచేశారు. ఆదివారం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ ప్రధాన కార్యక్రమాన్ని హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా గన్పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి, ప్రజలకు జరిగిన తీరని అన్యాయాలను, అక్రమాలను, సమైక్య పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ఉద్యమబావుటా ఎగురవేశామని గుర్తుచేశారు. తెలంగాణ సాధనతోనే తన జన్మ చరితార్థమైందని భావించానని, కానీ ఆ తర్వాత ప్రజల ఆజ్ఞను శిరసావహించి పునర్నిర్మాణ కార్యాన్ని సైతం నిబద్ధతతో నిర్వహిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర సత్వరాభివృద్ధితోపాటు ‘సంపద పెంచాలి, పెరిగిన సంపదను అవసరమైన వర్గాల ప్రజలకు పంచాలి’ అన్న ధ్యేయంతో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నదని వెల్లడించారు. సంక్షేమ పథకాల ఫలితంగానే నేడు రాష్ట్రంలో పేదరికం తగ్గి, తలసరి ఆదాయం పెరిగిందని, 2015-18 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం, 2019-21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చిందని వివరించారు. మరో పక్క తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెప్పారు. ‘తెలంగాణ ఆచరిస్తున్నది- దేశం అనుసరిస్తున్నది’ అన్న మాట అక్షర సత్యమని, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు మన ప్రభుత్వ పథకాలను అనుసరించడం, తెలంగాణలో సాగుతున్న సుపరిపాలనను తమ తమ రాష్ర్టాల్లో సైతం సాగాలని అకడి ప్రజలు కోరుకోవడమే ప్రత్యక్ష ఉదాహరణ అని సీఎం కేసీఆర్ వివరించారు.
పాలమూరు జిల్లాలో అప్పట్లో వ్యవసాయయోగ్యమైన భూమి 35 లక్షల ఎకరాలుగా ఉండేదని, అయితే ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం ఉన్న భూమి కేవలం 4.5 లక్షల ఎకరాలకు పరిమితమైందని, దీంతో ప్రజలకు బతుకుదెరువుకోసం వలసలే గతి అయ్యాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. పాలమూరు పరిధిలో నాటి ఉమ్మడి పాలకులు మొదలుపెట్టి పెండింగ్లో పెట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్సాగర్ వంటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన బీఆర్ఎస్ ప్రభుత్వం పూరి ్తచేసిందని గుర్తుచేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ ఇన్టేక్ వెల్ నుంచి కృష్ణా జలాలను ఎత్తిపోసే బాహుబలి మోటర్ను శనివారం ప్రారంభించామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 6 జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాల భూములకు సాగునీరు, 1,226 గ్రామాలకు తాగునీరు అందుతుందని వివరించారు.
పాలమూరులో ఇప్పటికే పూర్తి చేసిన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని, గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మిగిలిన పనులు పూర్తిచేసి మొత్తం 45 లక్షల ఎకరాలకు, ఖమ్మం జిల్లాలో 36 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న సీతమ్మసాగర్ బరాజ్ పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. దీని నుంచి నీటిని ఎత్తిపోసే సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త, పాత ఆయకట్టు కలిపి 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. సమ్మకసాగర్ బరాజ్ నిర్మాణం పూర్తయిందని, దేవాదుల ఎత్తిపోతల ద్వారా త్వరలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5 లక్షల ఎకరాలకు నికరంగా సాగునీరు అందించబోతున్నామని స్పష్టంచేశారు. ప్రధానమైన ఎత్తిపోతల పథకాల ద్వారా 75 లక్షల ఎకరాలకు, ఇతర భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చెరువుల ద్వారా మరో 50 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 85 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, మూడునాలుగేండ్లలో మొత్తం 1.25 కోట్ల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యం నెరవేరుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
దశాబ్ద కాలంలోనే కొత్తగా 21 వైద్య కళాశాలలను ప్రారంభించి ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో మరో 8 మెడికల్ కాలేజీలను వచ్చే ఏడాది ఏర్పాటు చేసేందుకు ఆమోదముద్ర వేసినట్టు వెల్లడించారు. దీంతో జిల్లాకో మెడికల్ కాలేజీ అనే లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోబోతున్నదని తెలిపారు. 2014 నాటికి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో కేవలం 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండగా, నేడు సీట్ల సంఖ్య 3,915 వరకు పెరిగిందని వివరించారు. 2014లో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కలిపి మొత్తం 2,850 మెడికల్ సీట్లు మాత్రమే ఉండగా, నేడు మూడింతలు పెరిగిపోయాయని, ఏటా 10 వేల మంది డాక్టర్లను తయారు చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంటున్నదని తెలియజేయడానికి గర్విస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. 108, 104 వాహన సేవల కోసం ఇటీవలే అదనంగా 466 వాహనాలను ప్రారంభించామని గుర్తుచేశారు. దీంతో ఇప్పుడు ఫోన్ చేసిన 15 నిమిషాలలోపు ఈ వాహనాలు వస్తున్నాయని, సకాలంలో వైద్యసేవలు అందుతుండటంతో ఎన్నో ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నామని వెల్లడించారు.
హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న దాదాపు లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను పేదలకు పంపిణీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. పారదర్శకంగా, లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపికచేసి, మహిళల పేరిట ఆ గృహాలను అందచేస్తున్నామని తెలిపారు. ఎవరైనా అర్హులకు ఇప్పుడు ఇల్లు రాకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఈ పథకం ఇంతటితో ఆగిపోయేది కాదని పేర్కొన్నారు. ఇది నిరంతరం కొనసాగుతుందని, సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదల కోసం‘గృహలక్ష్మి’ పథకాన్ని కూడా ప్రారంభించామని, ఈ పథకం కింద లబ్ధిదారులకు గృహనిర్మాణం కోసం మూడు దశల్లో రూ.3 లక్షల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. తొలి దఫాలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందికి ఈ ప్రయోజనం చేకూరుస్తున్నామని తెలిపారు. గతంలో కేవలం రూ.200 ఉన్న ఆసరా పింఛన్ మొత్తాన్ని రూ.2,016కు పెంచామని, దివ్యాంగులుకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని ఇటీవలే రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచుకున్నామని వివరించారు. రాష్ట్రంలో 2014 నాటికి పింఛన్ తీసుకునేవారి సంఖ్య 29 లక్షలు మాత్రమే ఉండగా, నేడు 44 లక్షల మంది పింఛన్లు తీసుకుంటున్నారని చెప్పారు. లబ్ధిదారుల వయో పరిమితిని 60 నుంచి 57 ఏండ్లకు తగ్గించిందని గుర్తుచేశారు.
రాష్ట్రంలో 2014 నాటికి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో కేవలం 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. నేడు సీట్ల సంఖ్య 3,915 వరకు పెరిగింది. 2014లో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కలిపి 2,850 మెడికల్ సీట్లు మాత్రమే ఉండగా, నేడు మూడింతలు పెరిగాయి. ఏటా 10 వేల మంది డాక్టర్లను తయారు చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంటున్నది.
– సీఎం కేసీఆర్
దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు సమాజంలోని అన్నివర్గాలపేదలకూ సంక్షేమ ఫలాలు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. సమైక్యపాలనలో దళితుల బతుకులు ఎకడ వేసిన గొంగళి అకడే అన్న చందంగా మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. అణగారిన దళితజాతి సమగ్ర అభ్యుదయం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకం ‘తెలంగాణ దళితబంధు’ అని, దళిత కుటుంబం తమకు వచ్చిన, తమకు నచ్చిన వృత్తి కానీ, వ్యాపారం కానీ చేపట్టడానికి వీలుగా ఈ పథకం కింద ఒకో దళిత కుటుంబానికి రూ.10 లక్షల భారీ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని మరోసారి గుర్తుచేశారు. బలహీన వర్గాలలోని వృత్తి పనుల వారికి, మైనార్టీ వర్గాలకు.. కుటుంబానికి రూ.లక్ష వంతున ప్రభుత్వం గ్రాంటు రూపంలో ఆర్థిక సాయం అందిస్తున్నదని చెప్పారు. ఆదివాసీలు, గిరిజనుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ, పోడు భూములకు పట్టాలందించిందని గుర్తుచేశారు. గిరిజన ఆరాధ్య నాయకుడు, జల్ జంగల్ జమీన్ నినాదమిచ్చిన కుమ్రంభీం పేరుతో ఏర్పాటయిన ఆసిఫాబాద్ జిల్లా నుంచే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఆదివాసీ, గిరిజనులకు ఇచ్చిన పోడు భూములకు రైతుబంధు కూడా అందజేస్తున్నామని వెల్లడించారు. పోడు భూముల కోసం జరిపిన పోరాటంలో అమాయక గిరిజనులపై ఉన్న కేసులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందని వివరించారు.
నేడు తెలంగాణ అనేక రంగాల్లో నంబర్ వన్ స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణమని కేసీఆర్ పేర్కొన్నారు. అనతి కాలంలోనే విద్యుత్తు రంగ సంక్షోభాన్ని అధిగమించి, అన్ని రంగాలకూ 24 గంటలపాటు, వ్యవసాయానికి పూర్తి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే అని స్పష్టంచేశారు. తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ అని, రూ.3,12,398 తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా ఉన్నదని చెప్పారు. నేడు మిషన్ భగీరథతో నూటికి నూరుశాతం ఇండ్లకు ఉచితంగా నల్లాలు బిగించి, స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని తెలిపారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో మొత్తం 6 జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు తాగునీరు అందుతుంది. పాలమూరులో ఇప్పటికే పూర్తి చేసిన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు మిగిలిన పనులు పూర్తిచేసి మొత్తం 45 లక్షల ఎకరాలకు, ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు ద్వారా కొత్త, పాత ఆయకట్టు కలిపి 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
సమ్మకసాగర్ బరాజ్.. దేవాదుల ఎత్తిపోతల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5 లక్షల ఎకరాలకు నికరంగా సాగునీరు అందించబోతున్నాం. ప్రధానమైన ఎత్తిపోతల పథకాల ద్వారా 75 లక్షల ఎకరాలకు, ఇతర భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చెరువుల ద్వారా మరో 50 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే 85 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. మూడునాలుగేండ్లలో మొత్తం 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం నెరవేరుతుంది.
– సీఎం కేసీఆర్
కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతలతోపాటు మిషన్ కాకతీయ, పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల పూర్తితో తెలంగాణ సాగునీటి రంగం స్వర్ణయుగాన్ని తలపిస్తున్నదని సీఎం కేసీఆర్ ఆనందం వ్యక్తంచేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో విత్తనాలు, ఎరువుల సరఫరా, పెట్టుబడి కోసం రైతుబం ధు, రైతుబీమా, రూ.37 వేల కోట్ల వరకూ పంట రుణాల మాఫీ తదితర సంక్షేమ చర్య లు రైతన్నకు ఊరటనిచ్చాయని వెల్లడించారు. ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకుందని చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్ని దేశంలోనే ప్రథమ స్థానం వైపు తెలంగాణ పరుగులు పెడుతున్నదని తెలిపారు. తెలంగాణ శాశ్వతంగా, సంపూర్ణంగా సుజల సుఫల సుసంపన్న వ్యవసాయ రాష్ట్రంగా విలసిల్లేందుకు కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకాల్లోని మిగిలిన పనులను వెంటనే పూర్తి చేసే పనిలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిమగ్నమై ఉన్నదని చెప్పారు.
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో మన పల్లెలు, పట్టణాల రూపురేఖలే మారిపోయాయని, చకటి వసతులు సమకూరి, పచ్చదనంతో పరిఢవిల్లుతున్నాయని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. ఇటీవల రాష్ట్రపతి చేతులు మీదుగా స్థానిక సంస్థల ప్రతినిధులు 13 జాతీయ అవార్డులు అందుకోవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. పాలనా సౌకర్యం కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, కొత్త గ్రామ పంచాయతీలు, అవసరాన్నిబట్టి కొత్త మండలాలు కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా సమీకృత కార్యాలయాలు, జిల్లా పోలీసు కార్యాలయ భవనాలు నిర్మించుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలన్న లక్ష్యానికి అనుగుణంగా గట్టి పునాదులు వేశామని ప్రకటించారు. పారదర్శక పరిపాలన నిరంతర విద్యుత్తు సరఫరా వంటి కారణాలతో అనేక అంతర్జాతీయ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయని చెప్పారు.
గతంలో కేవలం రూ.200 ఉన్న ఆసరా పింఛన్ మొత్తాన్ని రూ.2,016కు పెంచాం. దివ్యాంగులుకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని ఇటీవలే రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచుకున్నాం. రాష్ట్రంలో 2014 నాటికి పింఛన్ తీసుకునేవారి సంఖ్య 29 లక్షలు మాత్రమే ఉండగా, నేడు 44 లక్షల మంది పింఛన్లు తీసుకుంటున్నారు. లబ్ధిదారుల వయో పరిమితిని 60 నుంచి 57 ఏండ్లకు తగ్గించాం.
– సీఎం కేసీఆర్