హైదరాబాద్, ఫిబ్రవరి19 (నమస్తే తెలంగాణ) : గురుకులాల్లో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు డిమాండ్ చేశారు. ఎస్సీ గురుకుల సొసైటీలోని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సొసైటీ సెక్రటరీ కృష్ణఆదిత్య గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గురుకులంలోని సమస్యలు, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అసోసియేషన్ల ప్రతినిధులతో చర్చించారు. పెండింగ్లో ఉన్న డీఏ ఏరియర్స్ను తక్షణమే చెల్లించాలని పలువురు అసోసియేషన్ల బాధ్యులు డిమాండ్ చేశారు.
గురుకుల పనివేళలను గతంలో మాదిరిగా ఉదయం 9 నుంచి 4:30గంటల వరకు పునరుద్ధరించాలని, నైట్ స్టే చేసిన ఉపాధ్యాయులకు మరుసటి రోజున విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. పార్ట్టైం, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీ ఉపాధ్యాయులకు రెగ్యులర్ సిబ్బందితోపాటుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ల డిమాండ్లపై సొసైటీ సెక్రటరీ కృష్ణఆదిత్య సానుకూలంగా స్పందించారు. విడతలవారీగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఆల్ తెలంగాణ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్(ఎట్గ్రీవ) ప్రెసిడెంట్ కూకట్ల యాదయ్య, ట్రెజరరీ బసవయ్య, పాపిరెడ్డి, సంఘాల బాధ్యులు రామలక్ష్మణ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.