మేడారం : వన దేవతలు సమ్మక్క – సారలమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుక సింగ్ పేర్కొన్నారు. వనదేవతల దర్శనానికి కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి, గిరిజన శాఖా మంత్రి రేణుక సింగ్ కలిసి శుక్రవారం ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం చేరుకున్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి వారికి స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా వారు తల్లుల దర్శనానికి గద్దెల వద్దకు చేరుకున్నారు. నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. అమ్మల గద్దెల మీదకు వెళ్లి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుక సింగ్ మాట్లాడుతూ.. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర గిరిజన విశ్వవిద్యాలయ పనులు చేపడతామన్నారు. ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. దేశంలో ప్రత్యేకంగా గిరిజన శాఖ పై ప్రధాని దృష్టి సారించారని పేర్కొన్నారు. గిరిజన కలలు ఉట్టిపడేలా భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన నైకపోడ్ కళాకారులచే ప్రత్యేకంగా రూపొందించిన పంచపాండవుల కళారూపాన్ని గిరిజన శాఖ మంత్రికి బహుకరించారు.