ఈ ఏడాది భారతదేశంపై లానినా ప్రభావం తీవ్రంగా ఉంటుందని, దాంతో వేసవిలో ఎండలు మండిపోతాయని వాతావరణ విభాగం కేంద్ర ప్రభుత్వాన్ని ఏడాది కిందటే హెచ్చరించింది. సహజంగానే మన దేశంలో ఏటా విద్యుత్తు డిమాండ్ పెరుగుతున్నది. పైగా వేసవిలో మాట చెప్పనక్కరలేదు. ఇలాంటి సమయంలో ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తది? విద్యుత్తుకు కొరత ఏర్పడకుండా ముందస్తుగా అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకొంటది. కానీ కేంద్ర పాలకులు అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేండ్లలో మతం గొడవల్లో బిజీగా ఉండి కరెంటు అంశాన్నే పట్టించుకోలేదు.
దేశానికి ఎంత విద్యుత్తు అవసరం? ఉత్పత్తి ఎంత ఉన్నది? భవిష్యత్తులో డిమాండ్ ఏమేరకు పెరగొచ్చు? డిమాండ్కు సరిపడా ఉత్పత్తిచేయాలంటే ఎంత బొగ్గు అవసరం? అన్న అంశాలపై ఓ విధానమే రూపొందించలేదు. దాని ఫలితమే నేడు దేశంలోని సగం రాష్ర్టాలకుపైగా కరెంటు కోతలు.. విద్యుత్తు సంక్షోభం.. అంధకారంలో కోట్ల మంది ప్రజలు.
తెలంగాణ ఏర్పడితే కరెంటు లేక అంధకారమయం అవుతుందని సమైక్యవాదులు అనేక సార్లు బెదిరించారు. తెలంగాణ ఏర్పడిన నాడు పరిస్థితి కూడా అలాగే ఉన్నది. అందుకే ఉద్యమ నేత నుంచి ముఖ్యమంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన కే చంద్రశేఖర్రావు మొదట దృష్టి పెట్టింది విద్యుత్తు పైనే.
రాష్ర్టానికి కరెంటు ఎంత అవసరం? ఎంత ఉత్పత్తి అవుతున్నది? అత్యవసరంగా ఏటా ఎంత కొనాలి? విద్యుత్తు మౌలిక సదుపాయాల పరిస్థితేమిటి? ట్రాన్స్ఫార్మర్ల నుంచి సబ్స్టేషన్లు, ఉత్పత్తి కేంద్రాలు, బొగ్గు సరఫరా వరకు ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్నదానిపై సవివరమైన ప్రణాళికను రూపొందించి, సమర్థంగా అమలు చేశారు. దాని ఫలితమే ఇప్పుడు దేశంలో కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరణ.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: దేశంలో విద్యుత్తు సంక్షోభం అంతకంతకూ తీవ్రమవుతున్నది. కోట్లమంది ప్రజలు మండు వేసవిలో గంటలకు గంటలు కరెంటు కోతలతో అల్లాడుతున్నారు. అనేక రాష్ర్టాల్లో రాత్రిళ్లు మొత్తం కరెంటు కోతలు విధిస్తుండటంతో జీవితాలు అంధకారమయం అవుతున్నాయి. కరెంటు లేక వేలకొద్ది చిన్న పరిశ్రమలు మూత పడుతున్నాయి. లక్షల మంది ఉపాధి కోల్పోతున్నారు. విద్యుత్తు ఉత్పత్తికి ప్రాణాధారమైన బొగ్గు కొరత దేశం ఎన్నడూ చూడనంత తీవ్ర స్థాయికి చేరుకొన్నది. దీంతో బొగ్గు రవాణాకోసం అనేక ప్యాసింజర్ రైళ్లను రద్దుచేశారు. త్వరలో మరో 650 రైళ్లు రద్దు కావచ్చని రైల్వే అధికారులు అంటున్నారు. దీంతో లక్షల ప్రజలు రైళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఈ సంక్షోభానికి రాష్ర్టాలే కారణమంటూ కేంద్రప్రభుత్వం మాటల దాడికి దిగుతున్నది.
విద్యుత్తు కొరతతో దాదాపు 16 రాష్ర్టాలు అంధకారంలో మగ్గుతున్నాయి. జార్ఖండ్, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ సహా అనేక రాష్ర్టాల్లో ఓ పూట మొత్తం కరెంటు ఉండటం లేదని ప్రజలు సోషల్మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో శుక్రవారం రాత్రంతా కరెంటే లేదు. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో దేశంలో విద్యుత్తు డిమాండ్ ఆల్టైమ్ రికార్డు స్థాయికి చేరింది. శుక్రవారం దేశంలో 2,07,111 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ ఏర్పడిందని కేంద్ర విద్యుత్తుశాఖ శనివారం ప్రకటించింది. గత ఏడాది ఏప్రిల్ 28న దేశంలో విద్యుత్తు డిమాండ్ 1,82,559 మెగావాట్లు. విద్యుత్తు కొరతతో అల్లాడుతున్నామని, అదనపు విద్యుత్తు సరఫరా చేయాలని చాలా రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
దేశంలో థర్మల్ విద్యుత్తుకు బొగ్గే ప్రాణాధారం. విద్యుత్తు ప్లాంట్లకు సరిపడా బొగ్గును సరఫరా చేసే విషయంలో కేంద్రప్రభుత్వం ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేయకపోవటంతో అత్యధిక ఉత్పత్తి సంస్థలు ఇప్పుడు బొగ్గు కొరతతో అల్లాడుతున్నాయి. దేశంలోని అన్ని విద్యుత్తు ఉత్పత్తి ప్లాంటలో కలిపి శనివారం నాటికి 22 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఇవి 10 రోజుల ఉత్పత్తికి మాత్రమే సరిపోతాయని సాక్షాత్తూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీయే వెల్లడించటం సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతున్నది. విద్యుత్తు ప్లాంట్లకు బొగ్గు సరఫరా పెంచేందుకు అదనపు ర్యాక్లు పంపుతున్నట్టు ఆయన వెల్లడించారు. బొగ్గు తరలించే రైళ్లు వేగంగా ప్రయాణించేందుకు 509 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తామని చెప్పటం కొసమెరుపు.
దేశంలో విద్యుత్తు సంక్షోభానికి రాష్ర్టాలే కారణమని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఆరోపించారు. రాష్ర్టాలు విద్యుత్తు బకాయిలు చెల్లించకపోవటం వల్లనే కంపెనీలు సరఫరా చేయటం లేదని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్- రష్యా యుద్ధంతో దిగుమతి చేసుకొనే బొగ్గుకు ధర భారీ పెరిగిందని, అందువల్ల చాలా థర్మల్ సంస్థలు ఉత్పత్తిని తగ్గించాయని మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలుపటం గమనార్హం. కాగా, దేశంలో విద్యుత్తు బొగ్గు సంక్షోభం కేంద్రప్రభుత్వ వైఫల్యమేనని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. విద్యుత్తు సంక్షోభంపై ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సెటైర్లు వేశారు. ‘మోదీగారూ.. ఈ విద్యుత్తు సంక్షోభంలో మీ వైఫల్యానికి ఎవరిని నిందిస్తారు? మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూనా? రాష్ట్ర ప్రభుత్వాలనా? లేదంటే దేశ ప్రజలనా?’ అని శనివారం ట్వీట్ చేశారు. 2022 నాటికి దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్తు ఇస్తామని 2015లో మోదీ ప్రకటించిన ప్రసంగం వీడియోను, దేశంలో బొగ్గు కొరతకు సంబంధించిన వార్తలే కనిపిస్తలేవంటూ ప్రధాని 2017లో చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియోను రాహుల్గాంధీ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం విద్యుత్తు సంక్షోభం ఎదుర్కొంటున్న రాష్ర్టాల్లో అత్యధికం బీజేపీ పాలనలోనే ఉన్నాయి. విద్యుత్తు సంక్షోభానికి రాష్ర్టాలే కారణమని కేంద్ర ప్రభుత్వం అంటున్నది. నేడు తెలంగాణలో మాత్రమే విద్యుత్తుకు సమస్య లేదు. అలాంటప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప పాలనాదక్షుడని కేంద్ర పాలకులు ఒప్పుకోవాలి కదా? ఒప్పుకొంటారా?
విస్తారమైన బొగ్గు గనులు, రైల్వే నెట్వర్క్ ఉన్న దేశంలో థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు వాటిని ఉపయోగించుకొనే సామర్థ్యం లేక ఇప్పటికీ తీవ్ర విద్యుత్తు కొరత ఎదుర్కొంటున్నాం. ఇందుకు మోదీ సర్కారును నిందించకూడదు. గతంలో 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్నే నిందించాలి. అప్పటి బొగ్గు, వి ద్యుత్తు, రైల్వేశాఖల మంత్రులదే ఈ పాపం (వ్యంగ్యంగా). సమస్యకు మోదీ సర్కారు సరైన పరిష్కారం కనుగొన్నది. ప్యాసింజర్ రైళ్లు రద్దుచేయాలి. బొగ్గు ర్యాకుల రైళ్లు పెంచాలి.. అంతే. మోదీ ఉన్నారు కదా.. ఏదైనా సంభవమే!
– పీ చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి
దిగుమతి చేసుకొంటున్న బొగ్గు ధరలు భారీగా పెరిగాయి. కానీ రాష్ర్టాలకు కేం ద్రం ఎలాంటి రాయల్టీ ఇవ్వటంలేదు. బొ గ్గు ను సరఫరా చేయటంలేదు. విద్యుత్తు శాఖకు తప్ప ఇతర అన్ని శాఖలకు బొగ్గు సరఫరాను కేంద్రప్రభుత్వం నిలిపేసింది. దేశంలో బొగ్గుకు కొరత లేకుంటే ప్యాసింజర్ రైళ్లను ఎందుకు రద్దుచేశారు. మా రాష్ట్రంలో 23 రైళ్లను రద్దుచేశారు.
– భూపేశ్ భాగేల్, ఛత్తీస్గఢ్ సీఎం