చిట్యాల : తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్రంతో చర్చించటానికి వెళ్లిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పని లేక ఢిల్లీకి వచ్చారు అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవమానకరంగా వ్యాఖ్యానించడం దారుణం. అది ఒక మంత్రులను ఎంపీలను మాత్రమే కాదు, యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించినట్లేనని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
బుధవారం ఆయన నల్లగొండ జిల్లా చిట్యాలలోని తన వ్యవసాయ క్షేత్రంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు.
ఈ సీజన్లో ఇప్పటివరకు దాదాపు 55 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించామని మరో 20 నుంచి 25 క్వింటాళ్ల ధాన్యం సేకరించాల్సి ఉందన్నారు. ఆ ధాన్యం సేకరణ విషయంలో లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని అడగడానికి ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర మంత్రులను కేంద్ర మంత్రి అవమానించేలా మాట్లాడారని గుత్తా వివరించారు. ఇక్కడి రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ధాన్యం పండుతుందన్నారు. అందువల్ల కేంద్రం బాయిల్డ్ రైస్ని కొనాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు ఎంపీలు ధాన్యం కొనుగోలు విషయంపై ఒక్కసారి కూడా కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో రైతులు ఇంత ఆందోళన చెందుతుంటే కాంగ్రెస్ వాళ్లు ఎక్కడ కూడా ఆ విషయంపై స్పందించకుండా టీఆర్ఎస్ను నిందించటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు కూడా రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో ఏ రోజు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదన్నారు. సమావేశంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, చిట్యాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తేరట్పల్లి హనుమంతు, నాయకులు గుండెబోయిన సైదులు, శీలా సత్యనారాయణ, చిర్రాబోయిన యాదయ్య, శ్రీశైలం వేలుపల్లి సందీప్, కుక్కల భిక్షం తదితరులు పాల్గొన్నారు.