హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): సింగరేణిపై కేంద్రం తన కుట్రను బహిర్గతం చేసింది. ప్రధాని మోదీ మొదలు బీజేపీ రాష్ట్ర నేతల వరకూ సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ పలికిన మాటలు బూటకమని తేలిపోయింది. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ తన అసలు స్వరూపాన్ని బట్టబయలు చేసుకుంది. ‘తెలంగాణలో సింగరేణి పరిధిలోని 4 బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నాం’ అని బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం లోక్సభలో ప్రకటించారు. తద్వారా సింగరేణిలో ప్రైవేటుకు ద్వారాలు తెరిచామని పరోక్షంగా వెల్లడించారు. ఈ మేరకు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి అడిగిన ప్రశ్నకు బుధవారం మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 38 బొగ్గు గనులను వేలం వేస్తున్నామని, 20 గనుల వేలం పూర్తయిందని వెల్లడించారు. సింగరేణిలోని కల్యాణిఖని బ్లాక్-6, కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణపల్లి గనులను వేలం వేయనున్నామని తెలిపారు. దీనిపై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని ప్రైవేట్పరం కానివ్వబోమని స్పష్టంచేశారు. కేంద్రం వైఖరిని మారకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, కేంద్రానిదే బాధ్యతని హెచ్చరించారు.
సింగరేణిలో గనుల ప్రైవేటీకరణను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదని మంత్రి ప్రహ్లాద్ జోషి అంగీకరించారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాశారని తెలిపారు. వేలాన్ని రద్దు చేసి ఆ నాలుగు గనులను సింగరేణికే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నదని పేర్కొన్నారు. ఒకే అంశంపై కేంద్ర మంత్రి రెండు పరస్పర విరుద్ధ సమాధానాలు ఇవ్వడం గమనార్హం. సింగరేణి ప్రైవేటీకరణపై ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం కాగా, రాష్ట్రం వాటా 51 శాతం ఉన్నది. సింగరేణిలో మెజారిటీ వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే. అలాంటప్పుడు కేంద్రం ఏకపక్షంగా సింగరేణిని ప్రైవేటీకరించడం సాధ్యం కాదు’ అని చెప్పారు. అదే సభలో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ‘తెలంగాణలోని నాలుగు బొగ్గు గనులను వేలం వేస్తున్నాం’ అని తెలిపారు.
సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, ఆ ప్రయత్నాలను మానుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ లోక్సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు బుధవారం పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమని, అది తమ పరిశీలనలోనే లేదని రామగుండం సభలో బీరాలు పలికిన ప్రధాని ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. ప్రధాని మాటలంటే పచ్చి అబద్ధాలని మరోసారి తేలిపోయిందని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో సింగరేణి అంశాన్ని తాము లేవనెత్తితే కేవలం నాలుగు బ్లాకులను ప్రైవేటీకరిస్తున్నామని కేంద్రం చెప్పటంపై నామా ఆగ్రహం వ్యక్తంచేశారు. బహిరంగ సభల్లో ప్రజల ముందు చేయబోమని చెప్పి.. చట్టసభల్లో బాజాప్తా ప్రైవేట్పరం చేస్తామని కేంద్ర మంత్రి పేర్కొనటం బీజేపీ ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. సింగరేణి గనుల వేలాన్ని తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సింగరేణికి బొగ్గుగనులు దక్కకుండా చేయటమే కేంద్రం లక్ష్యమని ఆరోపించారు. దశలవారీగా కోల్బ్లాక్లను వేలం ద్వారా ప్రైవేట్కు కట్టబెడుతూ ఉంటే సింగరేణి మనుగడ ఎలా సాగిస్తుందని ప్రశ్నించారు. తెలంగాణకు గుండెకాయ వంటి సింగరేణిని ప్రైవేటీకరించవద్దని సీఎం కేసీఆర్ గతంలో అనేకసార్లు ప్రధానికి లేఖలు రాశారని గుర్తుచేశారు. సింగరేణిని తెలంగాణకే వదిలేయాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతమేనని, దానిని తీసుకొంటుందని చెప్పారు. సింగరేణి నుంచి దాదాపు రెండు వేలకు పైగా పరిశ్రమలకు బొగ్గు సరఫరా అవుతున్నదని, వేల మంది కార్మికులు సంస్థపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్నారని, ఒక్కసారి ప్రైవేటీకరణ జరిగితే అందరూ రోడ్లమీద పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ర్టానికి అడుగడుగునా అన్యాయం చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్రం ప్రభుత్వ వైఖరిని తెలంగాణ సమాజం సహించదన్నారు. కేంద్రం తీరుపై పార్లమెంట్లో నిలదీస్తామన్నారు.
సింగరేణిలో 51% వాటా ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కేంద్రం నాలుగు బొగ్గు బ్లాక్లను ప్రైవేట్పరం చేయడం దారుణమని ఎంపీ రంజిత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సింగరేణిని దశలవారీగా నిర్వీర్యం చేసి రాష్ట్రంలో విద్యుత్తు వ్యవస్థను అస్తవ్యస్తం చేయాలనే కుట్రలో భాగంగానే బీజేపీ ఈ కుట్రకు తెరతీసిందన్నారు. క్రమంగా సింగరేణిని లేకుండా చేయాలన్నదే మోదీ సర్కార్ పన్నాగమని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వబోమని పేర్కొన్నారు. కేంద్రం తన వైఖరిని మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, దానికి కేంద్రమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.