ఆదిలాబాద్ : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలు నూకలు తినాలి అంటూ అవమాన పరిచేలా మాట్లాడుతున్నారు. వడ్లు కొనుగోలు చేయాలని చట్టంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. తెలంగాణ రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దిష్టిబొమ్మను తాంసీ మండలం పొన్నారిలో మంత్రి ఆధ్వర్యంలో దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పంజాబ్లో రెండు పంటలు కొంటున్న కేంద్రం తెలంగాణలో వడ్లు ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న 700 మంది రైతులను కేంద్రం పొట్టన పెట్టుకుందని విమర్శించారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి రైతులు ప్రజలపై భారం మోపింది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అహంకార ధోరణిలో సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు.