హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): పశు సంవర్ధకశాఖలో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు ఎంతో బాగున్నాయని కేంద్ర పశు సంవర్ధకశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ప్రశంసించారు. వివిధ రాష్ర్టాల పశు సంవర్ధకశాఖ మంత్రులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలు ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. ఇదేస్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పశు సంవర్ధకశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్టు తెలిపారు. కులవృత్తులకు ప్రాణం పోసేలా గొర్రెలు, చేప పిల్లల పంపిణీని చేపట్టినట్టు వివరించారు. 100 సంచార పశు వైద్యశాలలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆర్కేవీవై పథకం కింద రంగారెడ్డి జిల్లా కరకపట్లలో టీకా ఉత్పత్తి కేంద్రం నిర్మించడం కోసం కేంద్ర ఆమోదించిన రూ. 75 కోట్లతోపాటు వివిధ కార్యక్రమాలకు ఆమోదించిన రూ.29 కోట్ల నిధులను త్వరితగతిన విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. మరో 100 పశు సంచార వైద్యశాల వాహనాలు,రెండు పశు వైద్య కృషి విజ్ఞాన కేంద్రాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.