గీసుగొండ/వెంకటాపూర్, జూన్ 4: వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేటలోని టెక్స్టైల్ పార్కు బాగున్నదని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహకార సహాయ మంత్రి బీఎల్ వర్మ కొనియాడారు. ఆదివారం ఆయన టెక్స్టైల్ పార్క్ను సందర్శించి అక్కడి పరిశ్రమలను పరిశీలించారు. అనంతరం పార్కు నమూనాను పరిశీలించి టీఎస్ఐఐసీ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పార్కులో చేస్తున్న పనులు బాగున్నాయని ప్రశంసించారు. పార్కులో మరిన్ని కంపెనీలు రావాలని ఆకాంక్షించారు. పార్కు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులు, సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే మరోసారి పార్కును సందర్శిస్తామని తెలిపారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయాన్ని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి బీఎల్ వర్మ సందర్శించారు. ఆలయ విశిష్టతను తెలుసుకొన్న ఆయన రామప్ప శిల్పకళ అద్భుతంగా ఉన్నదని, కాకతీయుల చరిత్రకు, వారి శిల్పకళ చాతుర్యానికి నిదర్శనంగా ఉన్నదని కీర్తించారు. నీటిలో తేలియాడే ఇటుకలు, సాండ్ బాక్స్ టెక్నాలజీ, రాళ్లలో సరిగమలు, గర్భగుడిలో నిత్యం వెలుతురు ఉండటం, సూక్ష్మ రంధ్రాలను చెక్కడం, నాటి శిల్పుల పనితీరుకు, ఇంజినీరింగ్ టెక్నాలజీకి రామప్ప నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందని కొనియాడారు. కాకతీయ రాజులు ఆలయంతోపాటు చెరువులను నిర్మించి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం వారి పరిపాలన దక్షతను తెలియజేస్తున్నదని అన్నారు.