హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దవాఖానలో చేరిన విషయం తెలిసిందే. గురువారం అర్ధరాత్రి ఆయన కాలు జారి కిందపడటంతో తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోదా హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్యంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. కేసీఆర్కు గాయమైన విషయం తెలియగానే చాలా బాధపడ్డట్లు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
కాగా, కేసీఆర్ను పరిశీలించిన వైద్యులు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. దీంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కేసీఆర్కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయనున్నారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. కేసీఆర్కు స్వల్ప గాయమైందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని వెల్లడించారు. కేసీఆర్పై ప్రజల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి తుంటి ఎముకకు గాయమైందని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
— G Kishan Reddy (@kishanreddybjp) December 8, 2023