G Kishan Reddy | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కనపెట్టి ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ కోసం కాంట్రాక్టర్లను, బిల్డర్లను, కంపెనీలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నదన్నారు. వైసీపీ నాయకుడు వెళ్లల రామ్మోహన్ తన అనుచరులతో కలిసి శుక్రవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కర్నాటక నుంచి సూట్ కేసులు వస్తే.. ఇప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాయని విమర్శించారు.
కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతాయి కానీ.. ఆరు గ్యారంటీలు మాత్రం అమలు చేయడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం చేసేదే చెప్తుంది.. చెప్పేది చేస్తుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన పీవీ నర్సింహారావును కాంగ్రెస్ అవమానిస్తే, మోదీ ప్రభుత్వం గౌరవించిందన్నారు. తొమ్మిదన్నరేండ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిందన్నారు. దేశంలో ఉగ్రవాదంపై ఉకుపాదం మోపిందని చెప్పారు. రావణకాష్టంలా మండే కశ్మీర్లో 370 ఆర్టికల్ ఎత్తేసి.. శాంతి నెలకొల్పిన ఘనత మోదీ ప్రభుత్వానిదన్నారు. తొమ్మిదిన్నర ఏండ్ల మోదీ పాలనలో ఒక రూపాయి అవినీతి జరగలేదన్నారు.