Union Minister Kishan Reddy | కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఈ జన్మలో ప్రధాని కాలేరని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కానీ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే తెలంగాణలో గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలను రేవంత్ రెడ్డి మోసగిస్తున్నారని అన్నారు.
ఆదివారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ నేతలు సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్, ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్, సీనియర్ నేతలు డీకే అరుణ, ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించారు. తెలంగాణలో తమ పార్టీకి సానుకూల వాతావరణం నెలకొందని కిషన్ రెడ్డి చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రజల దగ్గరకు వెళ్లాలని అన్నారు.