హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ ‘క్లీన్చిట్’ ఇవ్వడం తెలంగాణ ప్రజల తీర్పును కాలరాయడమేనని కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుపై అసెంబ్లీ స్పీకర్ తీరును ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఫిరాయింపు అంశంపై ఢిల్లీలో స్పందించారు. ఫిరాయింపులను అరికట్టాల్సిన బాధ్యతాయుతమైన స్పీకర్ పదవిలో ఉండి వాటికి చట్టబద్ధత కల్పించడం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయంగా అభివర్ణించారు. ఇది ప్రజల తీర్పును కాంగ్రెస్ పార్టీ అపహాస్యం చేసిన తీరుకు నిదర్శనమని పేర్కొన్నారు
ప్రజాస్వామ్యం ఖూనీ: బండి సంజయ్
కడియం శ్రీహరి, దానం నాగేందర్పై అనర్హత పిటిషన్ను స్పీకర్ డిస్మిస్ చేయడం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కండువా వేసుకుని ప్రచారం చేసినా పార్టీ ఫిరాయించలేదని చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉన్నదని, స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని స్పష్టంచేశారు. బెంగాల్లో అనర్హత పిటిషన్పై స్పీకర్ ఇదే తరహా తీర్పు ఇస్తే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలతో కొట్టివేసిందని చెప్పారు.
స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం:రామచందర్రావు
పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓ వ్యక్తి ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆరు నెలల లోపే వేరే పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం రాష్ట్ర ప్రజలంతా చూశారని గుర్తుచేశారు. ఇంత స్పష్టంగా ఫిరాయింపు ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపుగా పరిగణించలేమని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని మాజీ ప్రధాని రాజీవ్గాంధీ తీసుకొచ్చారని, ఈ అంశంపై రాహుల్గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.