తెలంగాణలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్తో శుద్ది చేసిన స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకవత్ మరోసారి అభినందించారు. బెంగళూరులో జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ అమలుపై దక్షిణాది రాష్ట్ర మంత్రులు, అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రతి గ్రామానికి.. లక్షల కుటుంబాలకు సురక్షితమైన నల్లా నీటిని అందిస్తున్నందుకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభినందించారు.
దీనిపై రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక అయిన మిషన్ భగీరథ కార్యక్రమం కింద రాష్ట్రంలోని వంద శాతం ఆవాసాలకు సురక్షిత మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే 23 వేల 930 గ్రామీణ ఆవాసాలకు 54 లక్షల 5 వేల నల్లా కనెక్షన్ల ద్వారా స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. దీనికి తోడు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి సౌకర్యం కల్పించామని అన్నారు.
తెలంగాణలోని వంద శాతం ఆవాసాలకు మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని, నిర్దేశించిన 2024 కంటే ముందే లక్ష్యం చేరుకుందని పలుమార్లు కేంద్రం ప్రశంసించి దేశంలోని అన్ని రాష్ట్రాలు స్ఫూర్తి పొందాలని స్పష్టం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం కింద వంద శాతం ఆవాసాలకు 54 లక్షల నల్లాల ద్వారా సురక్షిత నీరు అందించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడమే కాకుండా నిధులు కూడా మంజూరు చేయాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. నీతి అయోగ్ సిఫార్సుల మేరకు తెలంగాణ రాష్ట్రానికి 19 వేల కోట్ల రూపాయల గ్రాంట్ను మిషన్ భగీరథ అమలు కోసం మంజూరు చేయాలని మంత్రి కేంద్రాన్ని కోరారు.