మడికొండ, సెప్టెంబర్ 24 : హనుమకొండ జిల్లా మడికొండ శివారులో కాకతీయ వీవర్స్ సొసైటీ ఆధ్వర్యంలోని టెక్స్టైల్ పార్కుకు కేంద్రం నిధులు ఇవ్వాలని నిర్వాహకులు కేంద్ర సహాయమంత్రి బీఎల్వర్మను అడిగారు. పార్కులో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఒక్కో యూనిట్కు రూ.కోటికిపైగా ఖర్చు చేసి స్థాపించినట్టు తెలిపారు. సహకార శాఖ నుంచి కొంతమేర నిధులు కేటాయిస్తే పూర్తి స్థాయిలో పనులు వేగవంతం చేస్తామని కోరగా.. టెక్స్టైల్ పార్కు అభివృద్ధికి అమిత్షాతో మాట్లాడుతానంటూ కేంద్ర మంత్రి వర్మ సమాధానం దాటవేశారు. సహకార శాఖకు సహాయమంత్రి అయినప్పటికీ ఎలాంటి హామీలు ఇవ్వకుండానే వెనుదిరిగారు. దీంతో సొసైటీ సభ్యులు అసంతృప్తికి లోనయ్యారు.
టెక్స్టైల్ పార్కు సందర్శనకు వచ్చిన కేంద్ర మంత్రి వర్మతో కలిసి ఫొటోలు దిగేందుకు బీజేపీకి చెందిన ఇరువర్గాల కార్యకర్తలు పోటీపడ్డారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. ఫొటోలు దిగేందుకు ఓ వర్గం వారు మంత్రి వద్దకు వెళ్లగా.. మరో వర్గానికి చెందిన వారు నెట్టేశారు. అక్కడి నుంచి మంత్రి వెళ్లిపోగానే ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో మడికొండకు చెందిన నాయకులు కల్పించుకొని సర్దిచెప్పారు.