Union Minister Bandi Sanjay | దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, ఆ తరువాత ప్రజలను దారుణంగా మోసం చెయ్యడం కాంగ్రెస్ డీఎన్ఏ లోనే ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. `ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో రైతులకు ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం దుర్మార్గం అని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ‘కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం’ పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హమీలకు, ఈనాడు సీఎం చేసిన ప్రకటనకు పొంతనే లేదు. ప్రతి రైతుకు, కౌలు రైతుకు ఎకరానికి రూ.15 వేలు చొప్పున, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా సొమ్ము చెల్లిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ నేడు అందుకు భిన్నంగా రూ.12 వేలు మాత్రమే ఇస్తానని ప్రకటించడం అంటే రైతులను దగా చేయడమే` అని పేర్కొన్నారు.
`ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయినా ఏడాది రైతు భరోసా చెల్లించకుండా ఎగ్గొట్టారు. ఆలస్యమైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని, గత ఏడాది చెల్లించాల్సిన బకాయి కూడా చెల్లిస్తారని ఆశించిన రైతులకు పూర్తి నిరాశే ఎదురైంది. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో రైతు భరోసా బకాయి చెల్లించకపోగా, ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన రైతు భరోసా హామీకి సైతం తూట్లు పొడిచి ఇందిరమ్మ అభయ హస్తమంటే భస్మాసుర హస్తం అని నిరూపించారు` అని బండి సంజయ్ చెప్పారు.
`శనివారం రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అదనంగా నయాపైసా కూడా సాయం చేయలేదని తేటతెల్లమైంది. ఎగ్గొట్టిన ఏడాది రైతు భరోసా బకాయి మొత్తాన్ని విభజించి ఏటా రూ.2,000 చొప్పున రాబోయే నాలుగేళ్లకు జోడించి చెల్లించాలనుకుంటున్నారే తప్ప రైతులకు అదనంగా ఒరగబెట్టిందేమీ లేదు. గతంతో పోలిస్తే కాంగ్రెస్ పాలనలో ఎకరాకు మరో రూ.2,000 రైతులు నష్టపోయినట్లయింది` అని బండి సంజయ్ తెలిపారు.
కౌలు రైతులకు, భూమిలేని వ్యవసాయ కూలీలకు సైతం రైతు భరోసా ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ కూలీలను పూర్తిగా విస్మరించడం అన్యాయం అని బండి సంజయ్ అన్నారు. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది రైతులకు ఎంత మొత్తాన్ని చెల్లిస్తారు? అట్లాగే ఎంత మంది కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా సొమ్ము చెల్లిస్తారో ప్రకటించకపోవడం విడ్డూరం. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో రైతు బంధు లబ్దిదారుల సంఖ్యలో భారీగా కోత విధించాలనుకుంటున్నదని ఆరోపించారు.
`ఇప్పటికే రుణమాఫీ పేరుతో కోతలు పెట్టారు. అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని, సన్న వడ్లకే బోనస్ పరిమితం చేశారు. అది కూడా కొంత మంది రైతులకే బోనస్ చెల్లించారు. 46 లక్షల మంది రైతులకు ‘రుణమాఫీ’ చెల్లిస్తామని 22 లక్షల మందికిపైగా రైతులకు ఎగ్గొట్టారు. రైతు సంక్షేమ ప్రభుత్వమంటే కోతలు విధించడమేనా? ఇందిరమ్మ పాలనంటే ఇచ్చిన మాట తప్పడమేనా? 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏడాదిపాటు తూట్లు పొడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండో ఏడాదిలోనైనా వాటిని పూర్తిస్తాయిలో అమలు చేయకపోవడం అన్యాయం. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలనెల రూ. 2500, తులం బంగారం, స్కూటీ ఇస్తామని తెలంగాణ ఆడబిడ్డలను నిండా ముంచారు. వృద్ధులు, వితంతవులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని చెబితే ఏడాదిగా ఎదురుచూస్తున్న అవ్వాతాతల నోట్లో మట్టికొట్టారు. రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తారని ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఎగనామం పెట్టారు. నెలానెలా రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తారని, 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తారని ఎదురు చూస్తున్న నిరుద్యోగులను నడిరోడ్డున పడేశారు. ఇల్లులేని పేదలందరికీ జాగా తోపాటు రూ. 5 లక్షల చొప్పున ఆర్దిక సాయం చేస్తామని హామీ ఇచ్చి పేదల బతుకులను బజారున పడేశారు` అని చెప్పారు.
`ఓట్ల కోసం అందరినీ వాడుకుని అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా సొమ్ము ఇవ్వాలి` అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అతి త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జీ కిషన్ రెడ్డి నాయకత్వంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేసి కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచుతాం అని హెచ్చరించారు.