Amit Shah | జనగామ చౌరస్తా/మెట్పల్లి నవంబర్ 20: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్న జనగామ, మెట్పల్లి బహిరంగ సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ స్కూల్ గ్రౌండ్లో, జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని అంబేద్కర్ మినీ స్టేడియంలో సోమవారం బీజేపీ శ్రేణులు బహిరంగ సభలు ఏర్పాటుచేశాయి. జనం లేక సభలు వెలవెల బోయాయి. పసలేని తన ప్రసంగంతో అమిత్ షా జనాల్ని ఆకట్టుకోలేకపోయారు. జనగామలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అమిత్ షా స్పీచ్ను తెలుగులోకి అనువదించినా ప్రజలకు అది చేరలేదు. చప్పగా సాగుతున్న అమిత్ షా ప్రసంగంతో సభా ప్రాంగణం నుంచి జనం లేచి బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు.
ప్రజలను బయటకు వెళ్లనీయకుండా కొందరు బీజేపీ నాయకులు మీకు డబ్బులివ్వబోమని బెదిరిస్తూ దౌర్జన్యంగా అడ్డుకున్నారు. వెళ్లేదారికి అడ్డంగా నిలబడి తమ చేతులతో లోపలికి నెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనను ఫొటో తీస్తున్న ‘నమస్తే తెలంగాణ’ విలేకరిపై సదరు కాషాయ గూండాలు బెదిరింపులకు దిగారు. స్థానిక బీజేపీ నాయకుడితో పక్కనే ఉన్న మరో నాయకుడు దాడికి దిగే ప్రయత్నం చేశారు. తన ప్రసంగానికి ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో అమిత్ షా కేవలం 18 నిమిషాల్లోనే ప్రసంగం ముగించి వెళ్లిపోయారు. ఒక్కొక్కరికి రూ.300 చెల్లించి జనగామ బీజేపీ సభకు అద్దె కూలీలను తరలించారు. మీటింగ్కు వచ్చిన కూలీలను లెక్కపెట్టి బహిరంగంగానే పేర్లు రాసుకుంటూ డబ్బులిస్తూ బీజేపీ నాయకులు కనిపించారు.
కొల్లాపూర్, నవంబర్ 20: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో కేంద్రమంత్రి నితిన్గడ్కరీ హాజరైన బీజేపీ సభ వెలవెలబోయింది. సభలో సగానికిపైగా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సభకు పెద్దఎత్తున జనాన్ని తీసుకురావడానికి బీజేపీ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మధ్యాహ్నం 3 గంటలకు సభావేదిక మీదకు నితిన్గడ్కరీ వచ్చి ప్రసంగించారు. గడ్కరీ హిందీలో చేసిన ప్రసంగాన్ని మరోనేత తెలుగులో అనువాదం చేసినా అర్ధంకాకపోవడంతో చాలా మంది మధ్యలోనే లేచి వెళ్లిపోయారు.