హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): వైద్యవిద్యార్థులు అంకితభావం, నిబద్ధతతో పేదలకు సేవలందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్లో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) సేవలను ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం రియల్ టైమ్ వీడియో స్పెషలిస్ట్ సంప్రదింపుల తీరును పరిశీలించారు. ఎంబీబీఎస్లో కొత్తగా చేరిన విద్యార్థులతో మహర్షి చరక్ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయడానికి కేంద్రం ఏబీడీఎం కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. క్యూఆర్ కోడ్ ఆధారంగా రోగుల నమోదు, వారికి అందిస్తున్న సేవలు, పరీక్ష నివేదిక లాంటి అంశాలను దేశంలో ఏ వైద్యశాల నుంచి అయినా చూసి వైద్యం అందించడానికి హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్)ను ఏబీడీఎం కలిగి ఉన్నదని చెప్పారు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్ఏ) కార్డ్ సాయంతో రోగులు తమ వైద్య రికార్డులను ఎకడైనా, ఎప్పుడైనా దేశమంతటా చూసుకోవడానికి వీలవుతుందని వివరించారు.
ఆరోగ్యాన్ని వ్యాపార వస్తువుగా పరిగణించవద్దని, సేవగా భావించాలని కోరారు. అనంతరం స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఆరోగ్య మంత్రి సమక్షంలో ఎయిమ్స్లో ఔషధ మొకల పెంపకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బీబీనగర్ ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డీన్ డాక్టర్ భాటియా, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, అకాడమిక్స్ డీన్ ప్రొఫెసర్ రాహుల్ నారంగ్, మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నీరజ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.