BJP Supports Corporates | దేశాన్ని పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనివ్వడానికి బదులు పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్నదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని అప్పగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదన్నారు. బుధవారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో ‘యాసంగి వరి ధాన్యం` కేంద్రం కొనకున్నా.. రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి మాట్లాడుతూ.. వరి ధాన్యం సేకరణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని అన్నారు. బాధ్యతారాహిత్యంతో చేతులెత్తేసిందన్నారు. ఈ దశలో సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. తక్కువ ధరకు ధాన్యం అమ్మకుండా.. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వమే మద్దతు ధరనిచ్చి చివరి గింజ వరకు సేకరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారని మంత్రి గుర్తుచేశారు. కేంద్రం గందరగోళంతో తమపై భారాన్ని మోపినా, రైతుల్లో భరోసా నింపడంతోపాటు ప్రమాదపు అంచుల్లో చిక్కుకున్న రైతాంగాన్ని ఆదుకున్నారని చెప్పారు.
ధాన్యం సేకరణను వ్యాపార సంస్థ మాదిరిగా లాభనష్టాల ప్రాతిపదికన చూడటం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దౌర్భాగ్య పోకడలకు నిదర్శనం అని నిరంజన్ రెడ్డి చెప్పారు. రైతుల ఉద్యమంతో ప్రధాని మోదీ దిగి వచ్చి దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి బీజేపీ సర్కార్ కొని తెచ్చుకున్నదన్నారు. ఇంత జరిగినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ తన రైతు వ్యతిరేక విధానాలను మార్చుకోవడం లేదన్నారు. ఇటీవలి వార్షిక బడ్జెట్లోనూ ఎరువుల సబ్సిడీలో రూ.35 వేల కోట్ల కోత విధించిందని తెలిపారు.
ఒకప్పుడు తెలంగాణ కరువు కాటకాలకు చిరునామాగా ఉందని, కానీ తెలంగాణ ప్రభుత్వ చర్యలతో రాష్ట్రం దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా అవతరించిందని నిరంజన్ రెడ్డి చెప్పారు. పలు ప్రాజెక్టుల నిర్మాణంతో 1.25 కోట్ల ఎకరాల భూమికి సాగు నీరందించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. తత్ఫలితంగా జన జీవితాల నుంచి కరువు, కాటకం అనే పదాలు శాశ్వతంగా నిష్క్రమించాయని, సజీవ జలధారలతో సస్యశ్యామల తెలంగాణ ఆవిష్కృతమైందని అన్నారు. రైతులకు విద్యుత్పై ఇస్తున్న సబ్సిడీ రూ.87,421 కోట్లు, తొలి దఫాలో 35.2 లక్షల రైతులకు రూ.16,144 కోట్లు, మలి విడుతలో 5.12 లక్షల రైతుల రుణాలు మాఫీ చేశామన్నారు.
ఇంకా రైతు బంధు పథకం కోసం రూ. 65,391 కోట్లు, రైతు భీమా కోసం రూ. 5,755 కోట్లు ఖర్చు చేశామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ యంత్రీకరణకు రూ. 3.79 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఫలితంగా దేశ సాగు విస్తీర్ణంలో తెలంగాణ వాటా 2.93 శాతం నుంచి 4.64 శాతానికి చేరుకున్నదన్నారు. రైతు బిడ్డగా, వ్యవసాయాన్ని అమితంగా ప్రేమించే రైతుగా యాసంగి పంటను ప్రభుత్వమే కొనుగోలుచేయడం పట్ల సీఎం కేసీఆర్ను టీఆర్ఎస్ ప్లీనరీ అభినందిస్తున్నదని నిరంజన్రెడ్డి తెలిపారు.
అదానీ కంపెనీ కోసమే హర్యానాలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయలేదని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. బీజేపీ దృష్టంతా కార్పొరేట్లపైనేనన్నారు. తమ సమీపంలోని పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఎఫ్సీఐ డీవో లేఖ జారీ చేసిందన్నారు. కంపెనీ సమీపాన కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయొద్దని.. అలా ఏర్పాటు చేస్తే గన్నీ బ్యాగులు.. డబ్బు ఇవ్వమని ఆ లేఖలో పేర్కొనడంతోనే కేంద్రం విధానం తేటతెల్లమైందన్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని గుంగుల కమలాకర్ బల పరిచారు. రాజ్యాంగంలోని 246వ అధికరణం ఏడో షెడ్యూల్ ప్రకారం కేంద్రమే వరి ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. అయినా కేంద్రం బాధ్యతారాహిత్యంతో తప్పుకున్నదని ఆరోపించారు. దీంతో యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయడానికి సీఎం కేసీఆర్ ముందుకు వచ్చారని కొనియాడారు. అందుకు రైతు బిడ్డగా సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.