హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని విద్యార్థులకు అందించే యూనిఫారాలను వస్త్రం అందిన 45 రోజుల్లో తయారుచేసి, పంపిణీకి సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటిని కుట్టేందుకు మహిళా సంఘాలను గుర్తించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. సర్కారు బడుల్లోని విద్యార్థులే కాకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లోని విద్యార్థులకు యూనిఫారాలను కుట్టించే బాధ్యతను మహిళాసంఘాలకు అప్పగించారు. రాష్ట్రంలో మొత్తం 63,44,985 జతల యూనిఫారాలు కుట్టాల్సి ఉంటున్నదని ప్రాథమికంగా అంచనావేశారు. వీ వీటిని కుట్టేందుకు 28,200 మహిళా సంఘాలు అవసరమని తేల్చారు. జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్లు ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.