హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ ) : సర్కార్ బడుల్లో చదివే 26లక్షల విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫారాలను ప్రభుత్వం ఉచితంగా అందజేయనున్నది. ఇందుకు తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ (టెస్కో) నుంచి 1.40కోట్ల మీటర్ల వస్ర్తాన్ని కొనుగోలు చేయనున్నది. యూనిఫారాల కోసం రూ.100 కోట్లకుపైగా నిధులను వెచ్చించనున్నది. గతంలో ఆయా వస్ర్తాన్ని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు (ఎస్ఎంసీ) ఇచ్చి, స్థానికంగా ఉండే దర్జీలు, టైలర్ల ద్వారా యూనిఫారాలను కుట్టించి అందించేది. దీనికి బదులుగా ఈ ఏడాది నుంచి యూనిఫారాలు కుట్టించే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించింది. ఒక్కో యూనిఫాం కుట్టుకూలీగా రూ.50 చెల్లిస్తారు. జూలై 15 కల్లా ఒక జత, ఆగస్టు 15 నాటికి మరో జతకు కావాల్సిన వస్ర్ర్తాన్ని జిల్లాలకు చేరుస్తామని టెస్కో అధికారులు పేర్కొంటున్నారు.
అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఒకే కలర్
ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులందరికీ రెండు జతల చొప్పున యూనిఫారాలను అందజేస్తారు. ప్రభుత్వ జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు పాఠశాలలు, కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, మోడల్స్కూళ్లు, గురుకులాలు, గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని ఒకే రూపంలో ఉన్న యూనిఫారాలను విద్యార్థులకు పంపిణీచేస్తారు.