పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమేనని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ.. అన్నంత పనీ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. పకోడీలు అమ్ముకోవడం తప్ప దేశ యువతకు ఆయన మరే ఇతర ఉద్యోగ అవకాశాలనూ కల్పించడం లేదని స్పష్టమవుతున్నది. మోదీ వల్లెవేస్తున్న ‘అచ్చేదిన్’లో యువతకు ఉపాధి అవకాశాలు పెరగకపోగా, గతంలో ఉన్న ఉద్యోగాలకే దిక్కులేదని తాజా గణాంకాలు పేర్కొంటున్నాయి. ఆయన హయాంలో పెరిగింది పకోడీ విక్రేతలు, చౌకీదార్లు, చాయ్వాలాల సంఖ్యేనని వెల్లడిస్తున్నాయి. మాన్యుఫ్యాక్చరింగ్ (తయారీ), గనులు తదితర సంఘటిత రంగాల్లో ఉపాధి అవకాశాలు నానాటికీ తగ్గిపోతున్నట్టు చెప్తున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం కొందరు వ్యాపారులు లక్షల కోట్లకు పడగలెత్తుతుంటే.. ధరల మోత, ఇతర సమస్యలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం విదితమే. తాజా గణాంకాల ప్రకారం.. గత పదేండ్లలో సంఘటిత రంగంలో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. 2011-12 నాటికి దేశ మొత్తం శ్రామికశక్తిలో 24.1 శాతంగా ఉన్న సంఘటిత రంగం వాటా.. 2021 నాటికి 0.9% క్షీణించి 23.2 శాతానికి పతనమైంది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటూ ఊదరగొడుతున్న మోదీ హయాంలో తయారీ రంగ ఉద్యోగాలు 12.5 నుంచి 11 శాతానికి, మైనింగ్ రంగ ఉద్యోగాలు 0.6 నుంచి 0.3 శాతానికి దిగజారాయి. ఈ రెండు రంగాల్లో మోదీ సర్కార్ విధానాలు పూర్తిగా విఫలమైనట్టు దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. సంఘటిత రంగంలో ఈపీఎఫ్, ఈఎస్ఐ చందాదారుల సంఖ్య పెరిగినట్టు కేంద్రం గొప్పలు చెప్తున్నా అది చాలా స్వల్పమేనని, అసంఘటిత రంగంలో చాయ్వాలాలు, చౌకీదార్లు, పకోడా విక్రేతల సంఖ్య మాత్రమే పెరిగిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఆత్మనిర్భర్ భారత్ పేరుతో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు దిగుమతులపై భారీగా పన్నులు మోపుతున్న మోదీ హయాంలో దారం కూడా చైనా నుంచే దిగుమతి అవుతున్నది.
దేశంలో పత్తి దిగుబడి గణనీయంగా ఉన్నప్పటికీ వస్ర్తాల తయారీలో మనం బంగ్లాదేశ్ కంటే వెనుకబడి ఉండటం గమనార్హం. ఉపాధి కల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లు కొవిడ్ సంక్షోభం వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయి పూర్తిగా కుదేలయ్యాయి. కేంద్రం లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినప్పటికీ అవేవీ ఎంఎస్ఎంఈలను ఆదుకొన్న దాఖలాలే లేవు. మోదీ సర్కారు తయారీ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ దిగుమతులను పెంచుకొంటున్నది. 2019లో 474 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశ దిగుమతులు 2021లో 610 బిలియన్ డాలర్లకు పెరగడం ఇందుకు నిదర్శనం. దీంతో ఆ ప్రభావం ఉద్యోగాలపై పడుతున్నది.