(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు మాటతప్పింది. ఫలితంగా గతంలో ఎన్నడూ చూడని రీతిలో నిరుద్యోగిత రేటు పెరిగిపోయింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదిక ప్రకారం.. సెప్టెంబర్లో 7.09 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు అక్టోబర్ నాటికి 10.05 శాతానికి ఎగబాకింది. గడిచిన రెండున్నరేండ్లలో కరోనా సంక్షోభం తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగిత రేటు పెరుగడం ఇదే తొలిసారి. గడిచిన నెలరోజుల వ్యవధిలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 6.2 శాతం నుంచి ఏకంగా 10.82 శాతానికి పెరగ్గా, పట్టణాల్లో ఇదే సమయంలో 8.44 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా 1,70,000 ఇండ్లల్లో ఈ సర్వేను నిర్వహించినట్టు సీఎంఐఈ తెలిపింది.
కోటిమంది ఉద్యోగార్థులు మార్కెట్లోకి
దేశంలోని మొత్తం శ్రామికవర్గంలో కేవలం 43 శాతం మందికే ఉద్యోగాలు ఉండగా, ఇప్పటికిప్పుడు అర్హతకు తగిన ఉద్యోగాలు కావాల్సినవారు 22 కోట్ల మంది వరకు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయంలో పొరుగుదేశాలు బంగ్లాదేశ్, పాకిస్థాన్లో కొంత మెరుగ్గా ఉన్నాయి. మొత్తం శ్రామికవర్గంలో బంగ్లాలో 54 శాతం మందికి, పాక్లో 48 శాతం మందికి ఉద్యోగాలు ఉన్నట్టు సమాచారం. గత అక్టోబర్లో భారత మార్కెట్లోకి కొత్తగా కోటి మంది ఉద్యోగార్థులు చేరినట్టు సీఎంఐఈ తెలిపింది. ఏటా 6 శాతం వృద్ధితో దూసుకుపోవాలనుకొంటున్న భారత్ ఆర్థికవ్యవస్థకు ఉద్యోగకల్పన ఓ సవాలుగా మారినట్టు వెల్లడించింది. కాగా, ఈ ఏడాది చివరినాటికి పది లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ఆర్భాటంగా ప్రకటించారు. అయితే, ఆచరణలో మాత్రం అది జరుగడం లేదని సీఎంఐఈ తాజా నివేదికను బట్టి అర్థమవుతున్నది.
దేశంలో నిరుద్యోగిత రేటు ఇలా..