నిరుద్యోగంలో భారత్ది 4వ స్థానం
కేంద్రంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ కల్పనలో నరేంద్రమోదీ సర్కారు ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ప్రపంచంలో నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉన్నదని గుర్తుచేశారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన డాటాతో మంగళవారం ఆమె ఓ ట్వీట్ చేశారు. దేశ యువతను మోదీ సర్కారు ఎలా విఫలం చేస్తున్నదో ప్రజలు అర్థం చేసుకోవాలని కామెంట్ చేశారు. ‘మోదీ ఫెయిల్స్ యూత్’ అనే హ్యాష్ ట్యాగ్ను జతచేశారు.
శ్రీలంకతో భారత్ పోటీ
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకతో భారత్ పోటీ పడుతున్నట్టు ఈ ట్వీట్ స్పష్టం చేస్తున్నది. నిరుద్యోగిత రేటు అధికంగా ఉన్న దేశాల జాబితాలో ఇరాన్ (28.5%), ఇరాక్ (27.5%), శ్రీలంక (25.5%) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత భారత్ 24.9% నిరుద్యోగిత రేటుతో నాలుగో స్థానంలో ఉన్నది. భారత్ కంటే బంగ్లాదేశ్లో ఉద్యోగ కల్పన బాగున్నది. ఆ దేశంలో నిరుద్యోగిత రేటు కేవలం 14.8 శాతమే. కవిత ట్వీట్ను పలువురు నిరుద్యోగులు రీ ట్వీట్ చేశారు. ఉద్యోగాల కల్పనలోనే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధి, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం, విదేశాంగ విధానం, జాతీయ భద్రత, మత సామరస్యాన్ని పెంపొందించడంలోనూ మోదీ సర్కారు ఘోరంగా విఫలమైందని ట్విట్టర్లోనే ఎండగట్టారు.