హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా.. ఒక్కటంటే ఒక్క పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు రగిలిపోతున్నా రు. తక్షణమే 20వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం లక్డీకాపూల్లోని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ముట్టడించారు. నిరుద్యోగులు ఆదివారం అర్ధరాత్రి నుంచే ముట్టడికి ప్రణాళికలు వేయడంతో ఇంటెలిజెన్స్ వ్యవస్థ అప్రమత్తమైంది. నిరుద్యోగులను ముందస్తు అరెస్టు చేశారు. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి పెద్దసంఖ్యలో నిరుద్యోగులు డీజీపీ ఆఫీసులోని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ముట్టడికి యత్నించడంతో కేసులు పెడుతామని పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారు.
ఆ రెండు చోట్లా పోలీస్ వలయం
డీజీపీ ఆఫీసు ముట్టడికి భారీ సంఖ్యలో నిరుద్యోగులు తరలివస్తున్నారని తెలుసుకున్న పోలీసులు.. ముందస్తుగానే దిల్సుఖ్నగర్, అశోక్నగర్లో బందోబస్తు ఏర్పాటుచేశారు. కోచింగ్ సెంటర్ల నుంచి నిరుద్యోగులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. ఇటీవల దిల్సుఖ్నగర్లో వేలాదిమంది నిరుద్యోగులు ఆకస్మిక ర్యాలీలు తీసిన ఘటనలు దృష్టిలో ఉంచుకొని.. పోలీసులు భారీగా మోహరించారు. కోచింగ్ సెంటర్లు, బస్, మెట్రోస్టేషన్లు, బస్స్టాప్ల వద్ద పోలీసులు మఫ్టీలో ఉన్నప్పటికీ పలువురు నిరుద్యోగులు వారి నుంచి తప్పించుకొని లక్డీకాపూల్ పరిసరాలకు సుమారు 100మంది చేరుకోగా అక్కడ వారిని అడ్డుకున్నారు. పోలీసులను తప్పించుకొని డీజీపీ ఆఫీసుకు చేరుకున్న నలుగురు నిరుద్యోగ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత వారిని నాంపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు.
జూలై 2 తర్వాత సీఎం ఇల్లు ముట్టడి..
పోలీసు ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న లక్షలాది మంది నిరుద్యోగుల కోసం తక్షణం 20వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇవ్వకపోతే జూలై 2 తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. 2023 నుంచి తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం కొత్తగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాడు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారని ఆరోపిస్తున్నారు. తక్షణమే నిరుద్యోగులతో చర్చలు జరుపాలని డిమాండ్ చేస్తున్నారు. 20వేలతో నోటిఫికేషన్ ఇవ్వకపోతే రాష్ర్టాన్ని రణరంగంగా మార్చుతామని హెచ్చరిస్తున్నారు.
రగులుతున్న నిరుద్యోగులు
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా.. ఒక్కటంటే ఒక్క పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వక పోవడంతో నిరుద్యోగులు రగిలిపోతున్నారు. తక్షణమే 20వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం హైదరాబాద్లోని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ముట్టడించారు. అప్రమత్తమైన పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. నిర్బంధాన్ని ఛేదించుకొని ముట్టడికి యత్నించిన నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.