హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ప్రభుత్వాన్ని కోరింది. టీచర్ల ఉద్యోగోన్నతులు, బదిలీలను చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివారం తపస్ బృందం సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డిలతో భేటీ అయ్యింది.
పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, జీవో-317 సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న బిల్లులు, మూడు డీఏలను మంజూరు చేయాలని వినతిపత్రాన్ని సమర్పించారు. సీపీఎస్ను రద్దు చేయాలని, నూతన పీఆర్సీ కమిటీ నివేదిక రాగానే ఫిట్మెంట్ను ప్రకటించాలని కోరారు. తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్, ఏబీఆర్ఎస్ఎం ప్రతినిధి సూరం విష్ణువర్ధన్రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు నరేందర్రావు, ఉపాధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్ తదితరులు సీఎంను కలిసినవారిలో ఉన్నారు.