హైదరాబాద్, జనవరి 25: ఆరేండ్లలో రాష్ట్రంలో భూగర్భజలమట్టం సగటున 4.08 మీటర్లు పెరిగిందని, ఆ మొత్తం 400 టీఎంసీలకు సమానమని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్కుమార్ తెలిపారు. ఇది దేశంలోనే అత్యధికమని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగానే ఇది సాధ్యమైందని, రాష్ట్రంలోని 93 శాతం మండలాలు, 70 శాతం చెరువులు సేఫ్జోన్లో చేరాయని వివరించారు. రాష్ట్రస్థాయి భూగర్భ జలాల సమన్వయ కమిటీ 6వ సమావేశం రజత్కుమార్ అధ్యక్షతన జలసౌధలో మంగళవారం కొనసాగింది. కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ, సెంట్రల్, స్టేట్ గ్రౌండ్వాటర్ బోర్డులు సంయుక్తంగా రూపొందించిన తెలంగాణ రాష్ట్ర భూగర్భ జల వనరుల నివేదిక-2020ను ఈ సందర్భంగా ఈఎన్సీ మురళీధర్, రాష్ట్ర భూగర్భజలశాఖ డైరెక్టర్ పండిత్ మద్నూరేతో కలిసి రజత్కుమార్ విడుదల చేశారు. భద్రాద్రికొత్తగూడెం, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్ జిల్లాల్లో శిలాప్రాంతాలకు చెందిన నేషనల్ అక్వా మ్యాప్లపై చర్చించి ఆమోదించారు. అనంతరం రజత్కుమార్ మాట్లాడుతూ మిషన్కాకతీయ, కాళేశ్వరం, ఇతర ఎత్తిపోతల పథకాల ద్వారా భూగర్భ జలాలు భారీగా పెరిగాయని చెప్పారు. 2013లో 13,390 మిలియన్ క్యూబిక్ మీటర్ల(ఎంసీఎం) భూగర్భ జలాల లభ్యత ఉండగా, 2020 నాటికి అది 15,128 ఎంసీఎంకి పెరిగిందని, మొత్తంగా 15 శాతం పెరుగుదల నమోదైందని వివరించారు. భూగర్భజలాల పెరుగుదలతో నీటి కాఠిన్యత తగ్గుతున్నదని, ఫ్లోరైడ్ ప్రభావం తగ్గుముఖం పడుతున్నదని వెల్లడించారు. నీటి సంరక్షణ, నిర్వహణలో దేశానికి తెలంగాణ దిక్సూచిలా మారిందని, ఇదే స్ఫూర్తిని మున్ముందు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
జిల్లాల్లో సమన్వయ కమిటీలు
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 1,025 పీజోమీటర్లకు అదనంగా 697 పీజోమీటర్లను ఏర్పాటు చేశామని, వాటి ఫలితంగా భూగర్భ జలమట్టం కొలతల్లో కచ్చితత్వం పెరిగిందని రజత్కుమార్ వివరించారు. భూగర్భ జలాల స్థాయి పర్యవేక్షణకు నెట్వర్క్ పెంచామని, రాష్ట్ర స్థాయి కో-ఆర్డినేషన్ కమిటీ తరహాలోనే జిల్లాల్లోని సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉన్నదని భూగర్భ జలశాఖ డైరెక్టర్ పండిత్ మద్నూరే కోరగా, అందుకు రజత్కుమార్ సానుకూలంగా స్పందించారు. సమావేశంలో భూగర్భ జలశాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్ జ్యోతికుమార్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ రీజినల్ డైరెక్టర్ సిద్ధార్థ్ కుమార్, సీనియర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.