హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగినట్టు భూగర్భ జలశాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఆగస్టు భూగర్భ జల నివేదికను వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టులో సాధారణం కంటే 40 శాతం అధిక వర్షపాతం నమోదైందని తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో భూగర్భ జలాలు పెరిగాయని వెల్లడించింది.
ఆగస్టులో రాష్ట్ర సరాసరి నీటిమట్టం 4.47 మీటర్లుగా నమోదైనట్టు పేర్కొన్నది. నిరుడు ఆగస్టు (2021లో 5.63 మీటర్లు)తో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా 1.16 శాతం పెరుగుదల కనిపించిందని తెలిపింది. వీటిలో సంగారెడ్డిలో గరిష్ఠంగా 3.77 మీటర్లు , కనిష్ఠంగా ఆదిలాబాద్లో 0.17 మీటర్లు పెరిగినట్టు తెలంగాణ భూగర్భ జలశాఖ స్పష్టం చేసింది.