(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ పాలనలో సామాన్యుడు కడుపునిండా తినటానికి కూడా భయపడే పరిస్థితి దాపురించింది. బియ్యం, పాలు, పప్పు, చింతపండు, గోధుమ, చక్కెర, వంట నూనె, కారం, పసుపు, ఉప్పు.. ఇలా దేన్ని ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి. జేబులో వెయ్యి రూపాయలతో కిరాణా షాపుకు వెళ్తే అరకొరగా మాత్రమే సరుకులు వస్తున్నాయి. బ్యాచిలర్లు, కాలేజీ విద్యార్థులు కర్రీస్ పాయింట్లలో కూర కొందామంటే రూ.30 నుంచి రూ.50 చెల్లించాల్సిందే. కేంద్రంలోని బీజేపీ సర్కారు డీజిల్ రేట్లను పెంచితే, దాని దెబ్బ వ్యవసాయ పెట్టుబడిపై, రవాణా వ్యవస్థపై పడింది. ఆ ప్రభావం సరుకుల మీద పడ్డది. మోదీ ముందు చూపులేని విధానాలతో అంతర్జాతీయంగా రూపాయి విలువ అథఃపాతాళానికి చేరుకొన్నది. దీని ప్రభావం దిగుమతులపై పడి అంతిమంగా నిత్యావసరాల ధరలు ఆకాశానికి చేరేలా చేసింది. మొత్తంగా సామాన్యుడి నడ్డి విరిగింది.
2014లో మోదీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు సుమారు 300 శాతం పెరిగినట్టు లోకల్ సర్కిల్స్ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా చార్జీలు 30 శాతం వరకు పెరిగినట్టు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ, ఆ లాభాన్ని వినియోగదారుడికి అందకుండా బీజేపీ సర్కారు తన ఖజానాకు మళ్లించింది. గడిచిన ఎనిమిదేండ్లలో మోదీ సర్కారు డీజిల్పై 512 శాతం, పెట్రోల్పై 194 శాతం ఎక్సైజ్ పన్నులను పెంచినట్టు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) నివేదిక వెల్లడించింది. ఒకవైపు రూపాయి పతనం, మరోవైపు చమురు ధరల పెంపు, కేంద్రం సుంకాలను తగ్గించకపోవడం వెరసి.. నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
బీజీపీ ప్రభుత్వం ఇంధన ధరలు పెంచడంతో వ్యవసాయ ఖర్చులు భారీగా పెరిగాయి. ఎకరం పొలం దున్నటానికి ట్రాక్టర్ కిరాయి రూ.800 నుంచి రూ.1500కి చేరింది. తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేస్తుంటే.. ప్రధాని మోదీ వ్యవసాయాన్ని దండుగ చేస్తుండు.
– బొడ్డుపల్లి గాలయ్య, రైతు, సంస్థాన్ నారాయణపురం
నేను కల్లు గీత కార్మికుడిని. రోజూ 20-25 కిలోమీటర్లు వెళ్తుంటా. అప్పట్లో రూ.100 పెట్రోల్ నాలుగైదు రోజులొచ్చేది. ఇప్పుడు రెండ్రోజులు వస్తలేదు. నెలకు రూ.1000-1500 వరకు ఎక్కువ ఖర్చు అయితుంది. కల్లు అమ్మితే వచ్చే దాంట్లో సగం పెట్రోల్కే అయితుంది.
– బీ.వెంకటేశం(కల్లుగీత కార్మికుడు), కస్తాల, చండూరు మండలం
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్తోపాటు నిత్యావసర ధరలు పెంచి పేదల కడుపు కొడుతున్నది. ఏ సరుకు కొనాలన్నా భయమేస్తుంది. అనేక పథకాలతో మాకు ఆసరాగా ఉంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటాం. మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేస్తాం.
– సీహెచ్ స్రవంతి, గృహిణి, మునుగోడు
గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను కేంద్రం అదుపు చేయాలి. ధరలు మోతతో సాధారణ, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతున్నది. పేదల కుటుంబ బడ్జెట్ తలకిందులు అయింది. సంపన్నులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని పేద, మధ్యతరగతి కుటుంబాలను నిర్లక్ష్యం చేయటం సరికాదు.
– లావణ్య, మియాపూర్
కేంద్ర ప్రభుత్వం ప్రజావంచనకు పాల్పడుతున్నది. గ్యాస్ ధరలు నియంత్రించడంలో బీజేపీ సర్కార్ పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడంపై దృష్టిపెట్టిన బీజేపీ ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్నది. వంటగ్యాస్ ధరలు పెరగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దేశంలోని కోట్లాది ప్రజల ఇబ్బందులు నివారించడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విఫలమైంది.
-కృష్ణకుమారీ, ఫతేనగర్ నివాసి