దేశ రాజకీయాలపై ఇద్దరిమధ్య సుదీర్ఘ చర్చ
గుణాత్మక మార్పు ఆవశ్యకతపై ఏకాభిప్రాయం
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో భేటీ అయ్యారు. ఆదివారం ప్రగతిభవన్లో జరిగిన ఈ సమావేశంలో మూడు గంటలకు పైగా ఇద్దరు నేతల మధ్య అనేక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. దేశంలో జాతీయ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యత, గుణాత్మక మార్పు రావడానికి ప్రత్యామ్నాయ ఎజెండా ఆవశ్యకతపై సీఎం కేసీఆర్ ఉండవల్లికి వివరించారు. జాతీయ ప్రత్యామ్నాయ ఎజెండా, వివిధ రంగాల్లో జరుగాల్సిన అభివృద్ధికి సంబంధించి ఇటీవలి కాలంలో వివిధ రంగాలకు చెందిన మేధావులు, నిపుణులు, నాయకులతో సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఉండవల్లితో సీఎం వివిధ అంశాలపై చర్చించినట్టు సమాచారం. దేశంలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితులపై ఇద్దరూ చర్చించారు.
జాతీయ స్థాయిలో ఏం చేయాలన్న ఆలోచనలు తనకు ఉన్నాయో ఉండవల్లికి సీఎం వివరంగా చెప్పారు. వివిధ రంగాల్లో దేశం ఎంతగా వెనుకబడింది.. జాతీయ స్థాయిలో రాజకీయంగా జరుగాల్సిన చర్చ, తాను సిద్ధం చేస్తున్న జాతీయ ఎజెండాలోని పలు అంశాలను ఉండవల్లికి వివరంగా సీఎం కేసీఆర్ తెలియజేశారు. జాతీయ స్థాయిలో తాను ముందుకు వెళ్లాలని పలు వర్గాల నుంచి సూచనలు వచ్చాయని సీఎం పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఉండవల్లి అభిప్రాయాలను కూడా సీఎం కేసీఆర్ తెలుసుకొన్నారు. కొద్ది రోజుల క్రితం ఉండవల్లితో సీఎం ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఆదివారం ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. త్వరలోనే ఇద్దరి మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.