రాంనగర్, మార్చి 16: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమ హోటల్లో శనివారం తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. శుక్రవారం రాత్రి నుంచే మాటు వేసిన సుమారు 30 మంది పోలీసు అధికారులు అర్ధరాత్రి దాటిన తర్వాత ఏకకాలంలో హోటల్ను చుట్టుముట్టి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో హోటల్ సెల్లార్లోని అకౌంట్స్ కార్యాలయంలో అట్ట పెట్టెల్లో దాచి ఉంచిన నగదును గుర్తించారు. వాటిని తెరిచి చూడగా సుమారు రూ.6,67,32,050 నగదు కనిపించింది. సుమారు ఆరు గంటలపాటు జరిగిన ఈ తనిఖీల్లో నగదును లెక్కించి హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. సరైన ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. తనిఖీలపై టౌన్ ఏసీపీ నరేందర్ మీడియాతో మాట్లాడారు. నగదుకు సంబంధించిన ఆధారాల కోసం హోటల్ మేనేజర్ రాఘవేంద్రబాబును వివరణ కోరగా.. సరైన సమాధానం చెప్పలేదని, పట్టుబడిన నగదును వీడియో చిత్రీకరించి సాక్షుల సమక్షంలో పంచనామా చేసినట్టు తెలిపారు. ఐటీ అధికారులకు సమాచారం అందించి వారికి నగదును అప్పగించామని ఏసీపీ తెలిపారు.